నిబంధనల ప్రకారమే చంద్రబాబుకు భద్రతా తనిఖీలు నిర్వహించారన్న పోలీసుల వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై టీడీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ అధినేతకు ఎయిర్పోర్టులో తనిఖీ చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. బాబుకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఏపీ ఐజీ ఈ.దామోదర్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు విషయంలో జరగరానిది జరిగిపోయినట్లు ప్రచారం చేస్తుండటంపై ఏపీ ఐజీ దామోదర్ స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడున్నరేళ్ల పాటు వీఐపీ సెక్యూరిటీ ఎస్పీగా పనిచేసిన ఆయన.. ఎయిర్పోర్ట్ భద్రతా నియమావళిని వివరిస్తూ బహిరంగ లేఖ రాశారు. భారత్లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ..బీసీఏఎస్ జారీ చేసిన 36/ 2005 సర్క్యులర్ ప్రకారమే భద్రతా అధికారులు నడుచుకుంటున్నారని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంలకు సైతం సెక్యూరిటీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత పదవిలో లేనప్పుడు ఆమెను కూడా ఎయిర్పోర్టుల్లో తనిఖీ చేసిన విషయాన్ని ఐజీ దామోదర్ గుర్తుచేశారు. అగ్రరాజ్యం అమెరికాలో మాజీ గవర్నర్లు, మాజీ ప్రెసిడెంట్లకు సైతం బాడీ స్కానింగ్ నిర్వహిస్తారన్న విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ సిబ్బంది తనిఖీ చేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది చంద్రబాబు విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని దామోదర్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేతకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై టీడీపీ వర్గాల ఆందోళనలు, పోలీసుల వివరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.