కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకక రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలవడంపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : తెలంగాణలో రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వార్తల నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుందామనుకున్న రెవెన్యూ ఉద్యోగులకు అపాయింట్ దొరకలేదు. దీంతో వారంతా చినజీయర్ స్వామిని ఆశ్రయించారు. సమస్య వివరించి తమను గట్టెక్కించాలని కోరారు.
రెవెన్యూ శాఖను రద్దుచేస్తామని సీఎం కేసీఆర్ అంటుండటంతో గత పదిరోజులుగా ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు సతీష్ నేతృత్వంలో ఉద్యోగులు సీఎంను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో శంషాబాద్కు చేరుకున్న ఉద్యోగ సంఘం నేతలు ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు.
సమస్యను సావధానంగా విన్న చినజీయర్ వారికి అభయం ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. సమస్య తన దృష్టికి వచ్చినందున ఇక ఎలాంటి ఇబ్బందులు రావని స్వామీజీ చెప్పినట్లు వివరించారు. కేసీఆర్ పాలనపై ఇప్పటికే పలు విమర్శలు ఉండటం, తాజాగా రెవెన్యూ ఉద్యోగులు సీఎం అపాయింట్మెంట్ దొరకక చినజీయర్ను ఆశ్రయించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.