ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ వ్యతిరేకించడంపై మీ కామెంట్ ఏంటి?
Recommended Video
చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఉభయసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి ఆమోదం అనంతరం బిల్లు చట్టంగా మారనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తమ తొలి హయాంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా అవసరమైన సంఖ్యాబలం లేనందున రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోయింది. దీంతో మోడీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తాజాగా మంగళవారం మరోసారి రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాగా.. సంఖ్యాబలం లేకపోయినా ఎన్డీఏ బిల్లుకు సభ ఆమోదముద్ర వేయించుకుంది. కొన్ని పార్టీలు ఓటింగ్లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయి బీజేపీకి సహకరించాయి. అయితే వైసీపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. టీడీపీ, టీఆర్ఎస్లు ఓటింగ్కు డుమ్మా కొట్టి అధికార బీజేపీకి సహకరించాయి.
ముస్లిమహిళలకు న్యాయ చేస్తామంటూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు వ్యతిరేకించాయి. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించాలన్న కేంద్రం నిర్ణయం సహేతుకమే అయినా అది తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించడం సమంజసంకాదని వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీలు అభిప్రాయపడ్డాయి. జైలుకు వెళ్లిన వ్యక్తి భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడని ప్రశ్నించాయి. అందుకే భర్తలకు శిక్షలు విధించే క్లాజ్ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాయి.
ఇదిలా ఉంటే ట్రిపుల్ తలాక్ విషయంలో కట్టె విరగొద్దు పాము చావాలన్న చందంగా వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్లు వ్యవహరించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్లో వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా టీడీపీని ఇరకాటంలో పడేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి మద్దతు ఎలా ఇస్తామన్న సంకేతాలు ప్రజలకు పంపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేే ససమయంలో బిల్లుకు మద్దతిచ్చి ముస్లింలను దూరం చేసుకోవడం ఇష్టంలేకనే వ్యతిరేక ఓటు వేసి ఉండొచ్చని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు సైతం ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును వ్యతిరేకించాయని అంటున్నారు. ఆ కారణంగానే సభకు గైర్హాజరై బీజేపీకి పరోక్షంగా సహకరించాయని అంటున్నాయి. మొత్తమ్మీద ట్రిపుల్ తలాక్ విషయంలో వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి