సాయంత్రం ఆరింటికల్లా మద్యం షాపులు మూసేయాలన్న జగన్ నిర్ణయంపై మీ కామెంట్ ఏంటి?
అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులకు భారీ షాక్ ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటల కల్లా ఏపీలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఇవి అమలైతే ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగనున్నాయి. అదే సమయంలో కీలకమైన బ్రాండ్లను సైతం తగ్గించాలని ఏపి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది.
నవరత్నాల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అయిదేళ్ల కాలంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తూ.. కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తానని చెప్పారు. ఈ హామీని నెరవేర్చడంలో భాగంగా ఏపీలో మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. అక్టోబర్ నుండి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అక్టోబర్ నుంచి నుండి మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని ఇప్పటికే దాదాపు నిర్ణ యానికి వచ్చారు. షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనున్నారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. కానీ అది ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది.
అందువల్ల సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చని.. అదే సమయంలో ప్రభుత్వ దశల వారీ మద్య నిషేధంలో భాగంగా ఈ నిర్ణయం ప్రభుత్వానికి ఇమేజ్ తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఇచ్చిన హామీ అమలులో జగన్ మరో ముందడుగు వేశారు. సాయంత్రం ఆరింటికల్లా మద్యం షాపులు మూసేయాలన్న జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.