అర్బన్ నక్సలైట్లను ఉపేక్షించేదిలేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మీ కామెంట్ ఏంటి?
ఉగ్రవాద సంస్థతో సంబంధంలేకపోయినా ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుపై ఓటింగ్ సందర్భంగా విపక్షం వాకౌట్ చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా చట్టంలో చేసిన సవరణలను హోం మంత్రి అమిత్ షా సమర్థించుకున్నారు. ఉగ్రవాదమనేది ప్రజల ధోరణుల్లో ఉంటుందే తప్ప సంస్థల్లో కాదని అన్నారు. కొందరు వ్యక్తులు సిద్ధాంతం పేరుతో అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపదని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా పాకిస్థాన్, చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్లో ఈ విధానం అమల్లో ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద సంస్థను నిషేధించిన మరుక్షణమే అందులోని వ్యక్తులు కొత్త సంస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ బిల్లు ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల పరిధిలోని శాంతి భద్రతల అంశంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని తప్పుబడుతున్నాయి.
ఇదిలా ఉంటే మోడీ సర్కారు తమకు గిట్టని వారిపై అర్బన్ నక్సలైట్లన్న ముద్రవేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవహక్కుల కోసం పోరాడే వారిని, కవులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, మావోయిస్టు పార్టీల్లో క్రియాశీలంగా ఉంటున్న వారిని అర్బన్ నక్సలైట్లగా ప్రకటిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చితే సామాన్య ప్రజలపై అర్బన్ నక్సలైట్లు, జాతి వ్యతిరేకులన్న ముద్రవేసి అరెస్ట్లు చేస్తే పరిస్థితి ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వారిని అర్బన్ మావోయిస్టులుగా గుర్తించి వారిని పట్టుకుంటారు. ఆ పేరు చెప్పి ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అర్బన్ నక్సలైట్లను ఉపేక్షించేదిలేదన్న కేంద్ర హోం మంత్రి ప్రకటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.