విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారకులెవరు? మీ కామెంట్ చెప్పండి
హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు బోర్డు తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. జిల్లా టాపర్ అయిన విద్యార్థిని తెలుగులో సున్నా మార్కులు రావడం రీవాల్యుయేషన్లో 99 మార్కులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ఫలితాల వెల్లడి విషయంలో ఏపీతో పోటీ పడి తప్పులతడకల రిజల్ట్స్ ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పుల కారణంగా చాలా మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనా అబ్సెంట్ అయినట్లు చూపారు. అంతేకాదు 900 మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడం తదితర పొరపాట్లు వెలుగులోకి వచ్చాయి. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారుల నిరలక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు.
ఫలితాలపై ఆత్రం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం.. ఇంటర్ బోర్డు తీరుపై గవర్నర్ నజర్
ఇంటర్ బోర్డు వైఫల్యాలపై గవర్నర్ నరసింహన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై నివేదిక కోరారు. మరోవైపు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై స్పందించింది. విచారణ కమిటీ ఏర్పాటు చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఇంటర్ ఫలితాల్లో ఈ తప్పులకు బాధ్యత ఎవరని భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి