ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య ఘర్షణలతో కొన్నిచోట్ల యుద్ధ భూమిని తలపించాయి. టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవల్లో ఇరు పార్టీల చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. అర్థరాత్రి వరకు ఉద్రిక్తతలు కొనసాగాయి.
ఏపీలో పోలింగ్ రోజున గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ బూత్లలో విధ్వసంతో పాటు ఏకంగా బరిలో ఉన్న అభ్యర్థులపైనే దాడులు జరిగాయి. ఇక పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త భాస్కరరెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు. రాప్తాడు, సనప, ఆత్మకూరు, ముదిగుబ్బ, యాడికి మండలాల్లోనూ హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఓటమి భయంతోనే రెండు పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం సరైన భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగానే పోలింగ్ హింసాత్మకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తమ్మీద ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపించేందుకు టీడీపీ, వైసీపీ అరచకాలే కారణమా? లేక ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కారణంగానే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.