ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది.ఎన్నికల అనంతరం పార్టీ మారమని హామీ ఇచ్చిన వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది.
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి పార్టీ మారమన్న హామీతో కూడిన అఫిడవిట్లు తీసుకునే విషయంలో చర్చలు జరుపుతోంది. అయితే ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణం ఏంటని భావిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.