జై శ్రీరాం : జై శ్రీరాం అన్న పదం మమతను ఎందుకు టెన్షన్ పెడుతోంది? మీ కామెంట్ చెప్పండి.
బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కన్నెర్ర జేశారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేతలు ఆమెకు జై శ్రీరాం అని రాసిన పోస్ట్ కార్డులను పంపింది. తాజాగా గెట్ వెల్ సూన్ కార్డులు పంపేందుకు సిద్ధమవుతోంది.
అయితే మమత మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. అది ఒక మతానికి సంబంధించిన నినాదమని, దాన్ని బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందన్నది ఆమె ఆరోపణ. లౌకిక వాదం కోసం బీజేపీ ఇస్తున్న ఆ నినాదాన్ని వ్యతిరేకించాలని మమత పిలుపునిచ్చారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని బెంగాల్ ప్రజలను కోరారు.
ఇదిలా ఉంటే మమత జై శ్రీరాం నినాదాన్ని వ్యతిరేకించడానికి పెద్ద కారణమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందుత్వ అజెండాను ముందుకు తెచ్చి బీజేపీ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని దీదీ భావిస్తున్నందునే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంది.
తాజాగా జై శ్రీరాం నినాదాలతో హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ తన ప్లాన్లో సక్సెస్ అయితే తృణమూల్ పరిస్థితి ఏంటన్న ఆందోళన మమత బెనర్జీలో కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తమ్మీద జై శ్రీరాం నినాదం బెంగాల్లో పెను దుమారమే రేపుతోంది. ఈ విషయంలో దీదీ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.