మోడీ, షా ప్రయత్నంతో కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందా లేక మరింత జఠిలమవుతుందా? మీ కామెంట్ ఏంటి?
జమ్మూ కాశ్మీర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్కంఠకు తెరదించుతూ దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యపై మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు గా విభజించింది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు రద్దయ్యాయి. భారత రాజ్యాంగంలోని నిబంధనలన్నీ పూర్తిగా రాష్ట్రానికి వర్తించేందుకు వీలు కలిగింది. జమ్మూ కాశ్మీర్లో స్థానికతను నిర్వచించేందుకు వారికి ప్రత్యేక హక్కులు కల్పించేందుకు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన ఆర్టికల్ 35ఎకు కూడా ముగింపు పలికారు.
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ శాసనసభలేని యూనియన్ టెరిటరీగా విడిపోనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానాలు, బిల్లులను సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యసభ ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రధాన రాజకీయపక్షాలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీంతో రాష్ట్రంలో అగ్ర నాయకులకు సోమవారం రాత్రి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. తన శైలికి భిన్నంగా వారిపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని వారికి సున్నితంగా మందలించారు. మత రాజకీయాలకు తాము, తమ పార్టీ ఎప్పటికీ దూరంగానే ఉంటుందని, వాటిపై తమకు ఏ మాత్రం విశ్వాసం లేదని ఎదురుదాడికి దిగారు. జమ్మూ కాశ్మీర్ ను ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగిస్తారన్న ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని నిండు సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు త్వరలోనే రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
మొత్తమ్మీద మోడీ ఆలోచన, అమిత్ షా చాతుర్యంతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య ఓ కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోడీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందా లేదా మరింత జఠిలం అవుతుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.