గులాబీ జెండా ఓనర్లము.. మంత్రి ఈటల మాటల మర్మమేంటి.. దీనిపై మీ కామెంట్ ఏమిటి?
హైదరాబాద్ : మంత్రి ఈటల రాజేందర్ మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ పుట్టించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే ఈటల ఇలా మాట్లాడటం బాంబ్ పేల్చినంత పనైంది. మంత్రి పదవి నాకు బిక్ష కాదని.. తాము గులాబీ జెండా ఓనర్లమని మాట్లాడిన తీరు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆ క్రమంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన మనసులోని ఆవేదన వెళ్లగక్కారా.. తనపై ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారా.. అనే డైలామా క్రియేట్ చేసేలా ఉన్న ఈటల మాటల తూటాలు ఒక్కసారిగా అలజడి రేపాయి.
ఈటల మంత్రి పదవిపై ఇటీవల అదో రకంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి కొన్ని విషయాలు లీక్ చేశారనేది ఆయనపై కొన్ని పేపర్లలో వార్తా కథనాలు వచ్చాయి. ఆ రకంగా ఆయన మంత్రి పదవికి ఎసరొస్తుందని పిచ్చి కూతలు కూసేవాళ్లు ఎక్కువైపోయారు. అదంతా కూడా ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూల పత్రికల్లో రాయించిన అభూత కల్పనలు అనే విషయం కొందరికీ మాత్రమే తెలిసిన నిజం. ఆ విషయంలో ఆయన సన్నిహితులతో బాధపడ్డారనే టాక్ వినిపిస్తోంది. అదే క్రమంలో హుజురాబాద్లో జరిగిన సమావేశంలో తన మనసులోని ఆవేదనంతా వెళ్లగక్కినట్లు కనిపించింది పరిస్థితి. అంతెందుకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రాదంటూ అసత్య ప్రచారం జరిగిన సందర్భాలున్నాయి.
ఈటల తూటాలు.. సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ ఎవరు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్..!
ఈటల రాజేందర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే మంచి వ్యాపారవేత్తగా ఉన్నారు. కోళ్ల పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ లాభాలు గడించారు. ఇక తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర సాధన కోసం ముందుండి కొట్లాడారు. లెఫ్ట్ భావజాలం కలిగిన నాయకుడిగా, ప్రజా నేతగా ముద్రపడ్డ ఈటలకు ఉద్యమం ఎన్నో పాఠాలు నేర్పింది. అప్పటి ఉద్యమ రథ సారధిగా ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా వెళ్లలేని చోటుకు ఈటల చొచ్చుకెళ్లారనే పేరుంది. అలా ప్రజా క్షేత్రంలో తనదైన ముద్ర వేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ధీరుడిగా ఆయనకు కూడా కచ్చితంగా ఓ పేజీ ఉంటుందనేది ఎవరైనా సరే కాదనలేని నిజం.
రాజకీయ వారసత్వం లేదు.. తనకు తానుగా నిలబడ్డారు. ఇక ముందు కూడా అలాగే నిలబడతానంటూ గర్వంగా చెప్పిన ఈటల గులాబీ జెండా ఓనర్లమంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. ఇంతకు ఈటల ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు.. అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందనేది సస్పెన్స్ క్రియేట్ చేసింది. తీరా ఈటల మాటల తూటాలపై మీడియాలో రచ్చ రచ్చ అయిన తర్వాత రాత్రి సమయంలో మరోసారి ఆయన స్పందించిన తీరు చర్చానీయాంశమైంది. కేసీఆరే మా నాయకుడంటూ, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నట్లు విడుదలైన ప్రెస్ నోట్ కొత్త చర్చకు దారి తీసింది.
ఇంతకు గులాబీ ఓనర్లము తామేనంటూ మంత్రి ఈటల రాజేందర్ చేసిన మాటల మర్మమేంటి? ఇటీవల ఈటల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీసీ నాయకుడిగా ఆయన వేరే ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారిగా ఆయన ఇలా తన మనోవేదనను ఎందుకు బయటపెట్టారు? ఈటల మాటల తూటాలపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అభిప్రాయం రాయండి.