Fact Check:కాలిపోయిన కాళీమాత విగ్రహం ఫోటో వైరల్..బీజేపీ ఎంపీ ట్వీట్.. నిజమేంటి..?
పశ్చిమ బెంగాల్ : సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అవాస్తవమైన వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అందులోను మతపరంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు కొందరు. దీంతో ఒక వర్గం వారిపై మరో వర్గం వారు దాడులకు దిగే పరిస్థితి వస్తోంది. ఇలాంటి వార్తలతో పెద్ద అనర్థాలే జరుగుతున్నాయి. దీనిపై డేగ కన్ను వేసి ఉంచాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు వైరల్గా మారింది. కాలిపోయిన కాళీమాత విగ్రహం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోపై ట్విటర్లో ఒక పోస్టు చేశారు బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్.
కాలిపోయినట్లుగా ఉన్న కాళీమాతా విగ్రహం ఫోటోను ట్విటర్లో పోస్టు చేస్తూ బెంగాల్లో మమతా బెనర్జీ జీహాదీ తరహా రాజకీయాలను చేస్తోందంటూ రాసుకొచ్చారు. అంతేకాదు హిందూ మతం హిందూ సాంప్రదాయాలకు పాతరేసేందుకు మమతా ప్రయత్నిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో ఒక మతం వారు ఆలయంను ఎలా ధ్వంసం చేశారో చూడండంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కాళీమాత విగ్రహంకు నిప్పు పెట్టారంటూ ట్వీట్లో చెప్పుకొచ్చారు. సిగ్గుపడాల్సిన విషయమంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవడంతో అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
విచారణ చేసిన అధికారులు అసలు వాస్తవం బయటపెట్టారు. ఎంపీ అర్జున్ సింగ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. అసలు ఏం జరిగిందన్న వాదనపై పోలీసులు విచారణ చేయగా కాళీమాతా ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని దీంతో మంటలు చెలరేగి విగ్రహం కాలిపోయిందని ఆలయ అధికారులు చెప్పినట్లు పోలీసులు ధృవీకరించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై దీనికి ఎవరు బాధ్యులో పోలీసుల సహకారంతో విచారణ చేస్తున్నామని ఆలయ అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ చేసిన వాదనల్లో నిజం లేదని తేల్చిన పోలీసులు ఆయనకు త్వరలోనే నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే చెబుతూ ఎంపీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అతనిపై లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమేరకు బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే పోస్టులపై చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని పోలీసులు కోరారు.
Fact Check
వాదన
కాళీ మాత విగ్రహంకు ఒక వర్గం వారు నిప్పు పెట్టారు
వాస్తవం
ఘటనకు ఎలాంటి మతపరమైన అంశం ముడిపడి లేదు, అగ్ని ప్రమాదం వల్లే జరిగింది