Fact check : జో బైడెన్ ఆ హైదరాబాదీని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ తన రాజకీయ సలహాదారుగా భారత సంతతి వ్యక్తిని నియమించుకున్నారా..? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్గా మారింది. భారత సంతతికి చెందిన అహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని బైడెన్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు,అతను హైదరాబాదీగా అందులో పేర్కొన్నారు. అహ్మద్ ఖాన్ జో బైడెన్ పక్కన నిలుచున్న ఓ ఫోటో... 'వివక్షకు తావు లేని రాజకీయాలు' అన్న ట్యాగ్ లైన్తో ఆ పోస్టు వైరల్ అవుతోంది.
అయితే ఈ పోస్టులో పేర్కొన్నట్లు జో బైడెన్ అహ్మద్ ఖాన్ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకోలేదు. అహ్మద్ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. నన్ను పొలిటికల్ అడ్వైజర్గా నియమించలేదు. ఒకవేళ అందుకు తాను అర్హుడిని అనుకుంటే.. నేనే ప్రయత్నించవచ్చు. ఇప్పటికైతే బైడెన్ కార్యాలయం నుంచి నన్నెవరూ సంప్రదించలేదు.' అని అహ్మద్ ఖాన్ తెలిపారు.
Recommended Video
సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఆ ఫోటో 2015కి సంబంధించినది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డ్రాఫ్ట్ బైడెన్-2016 క్యాంపెయిన్కి అహ్మద్ ఖాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయంపై అహ్మద్ ఖాన్ తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించారు. ఆయన గెలుపును కొనియాడుతూ.. ఆయనతో దిగిన కొన్ని ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఈ ఫోటోల్లోనిదే
Fact Check
వాదన
జో బైడెన్ తన రాజకీయ సలహాదారుగా భారత సంతతి వ్యక్తిని నియమించుకున్నారు.
వాస్తవం
బైడెన్ ఇప్పటివరకూ అలాంటి నిర్ణయమేది తీసుకోలేదు.