Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?
భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ ఎంతోమంది గూగుల్లో ఈ అంశంపై సెర్చ్ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఈ నోటును ప్రభుత్వం నిషేధించిందా... లేదా నిషేధించబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
Oneindia దీనిపై పలువురు అధికారులను సంప్రదించగా... ఇప్పటివరకూ అలాంటి నిర్ణయమేదీ లేదని స్పష్టం చేశారు. 2019-2020లో రూ.2000 నోట్లను ముద్రించలేదని ఆర్బీఐ ఇచ్చిన వార్షిక నివేదికతో ఈ ఊహాగానాలకు తెరలేసింది. గత కొన్నేళ్లుగా రూ.2వేల నోటు సర్క్యులేషన్ కూడా తగ్గిందని నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది.
2018 నాటికి దేశంలో రూ.2000 నోట్లు కేవలం 33,632 మాత్రమే ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఆ తర్వాత 2019 మార్చి నాటికి ఆ సంఖ్య మరింత తగ్గి 32,910కి చేరిందని... 2020 మార్చి నాటికి 27,398కి చేరిందని ఆర్బీఐ తమ నివేదికలో స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి భారత్లో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2000 నోట్లు కేవలం 2.4శాతం మాత్రమే. 2018లో ఇది 3.3శాతంగా ఉండగా... 2019లో 3శాతంగా ఉంది. మరోవైపు,రూ.500,రూ.200 నోట్లు చలామణి క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నోట్ల చలామణి 23.1శాతం మేర తగ్గింది. కోవిడ్ 19 కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు.
Fact Check
వాదన
రూ.2వేల నోట్లు ఇండియాలో నిషేధించబడిందన్న ప్రచారం,సందేహాలు...
వాస్తవం
రూ.2వేల నోట్లు ఇండియాలో నిషేధించబడలేదు