Fact Check:మురుగు నీరు ప్రవహించే ఆ రహదారి మోడీ నియోజకవర్గంలోనిదా..?
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. తవ్వివున్న రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందంటూ ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోనిదంటూ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారణాసి అత్యంత పరిశుభ్రమైన నగరంగా రికార్డులకు ఎక్కిన నేపథ్యంలో ఈ ఫోటో వైరల్ కావడం పెద్ద చర్చకు దారితీసింది. స్వచ్చ్ సర్వేక్షన్ కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన పరిశుభ్రమైన నగరాల్లో గంగా తీరం వెంటా ఉన్న పరిశుభ్రమైన నగరాల కేటగిరీలో వారణాసి అతి పరిశుభ్రమైన నగరంగా ర్యాంకు పొందింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేల నగరాలను కేంద్రం పరిగణలోకి తీసుకుని వీటికి ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది.
ఆ ఫోటోపై హిందీలో ఇలా రాసి ఉంది. బీజేపీ ప్రభుత్వం బెనారస్ను లండన్లా మార్చిందంటూ ఫోటోపై రాసి ఉంది. ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫోటో నిజంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోనిదేనా అని ఆరా తీశాం. అయితే ఇది ఢిల్లీలో తవ్వివున్న ఓ రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరుగా తేలింది. ఈ ఫోటో కూడా ఎప్పుడో 2018లో తీసినట్లుగా వెల్లడైంది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని తేలింది. ఆరుష్ షా అనే ట్విటర్ యూజర్ ఈ ఫోటోను తీసి ఢిల్లీలోని సంగం విహార్లో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండంటూ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో వారణాసిలోనిదంటూ చక్కర్లు కొడుతున్న ఫోటో వాస్తవానికి ఢిల్లీలోని సంగం విహార్లో తీసినది.
Recommended Video
వాస్తవంగా ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలోని రహదారి మరమత్తుల కోసం తవ్వారు. వర్షపు నీరు వస్తుండటంతో దానికోసం ఒక డ్రైనేజీ ఏర్పాటు చేయాలని రహదారిని తవ్వారు. అయితే అక్కడ తవ్విన రహదారి అలానే ఉండగా దాన్ని మరమత్తులు చేసే కార్యక్రమం మాత్రం జరగలేదు. ఇక సంగం విహార్ నివాసితులు తవ్వి ఉన్న ఈ రహదారిపై ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పేర్కొంటూ ప్రచురితమైన కథనాలు కూడా దొరికాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న సంగంవిహార్ ఏరియా ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీపై ఉందంటూ ప్రధాన శీర్షికలో కథనాలు ప్రచురితమయ్యాయి. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరుతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కథనాలు వచ్చాయి.
Fact Check
వాదన
ఫోటోలో ఉన్నట్లుగా రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు వారణాసిలోనిది
వాస్తవం
వాస్తవానికి ఫోటోలో కనిపిస్తున్నట్లుగా మురుగునీరు ప్రవహిస్తున్నది వారణాసిలో కాదు..ఢిల్లీలోని సంగంవిహార్ ప్రాంతంలో.