Fact Check:రైల్వేలను అదానికి అప్పగిస్తున్నారన్న ప్రియాంకా గాంధీ..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై కేంద్ర ప్రభుత్వ సమాచారా సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. ప్రియాంకాగాంధీ షేర్ చేసిన ఫేస్బుక్ పోస్టు స్క్రీన్ షాట్ను తిరిగి పోస్టు చేస్తూ ఇది తప్పుడు సమాచారం అని వివరణ ఇచ్చింది. రైల్వే సంస్థను ఏ ప్రైవేట్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులను షేర్ చేసి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దంటూ వెల్లడించింది. ఇది కేవలం రెవిన్యూను మెరుగుపరచకోవడం ఇచ్చిన అడ్వర్టయిజ్మెంట్ అని స్పష్టం చేసింది కేంద్రం ప్రభుత్వం.
కొన్ని కోట్ల మంది భారతీయుల శ్రమతో భారతీయ రైల్వేలు సృష్టించబడిందని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తన ఆప్తమిత్రుడు అయిన అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని హిందీలో పేర్కొంటూ 45 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ప్రియాంకా వాద్ర ఫేస్బుక్లో షేర్ చేశారు. అంతేకాదు వ్యవసాయ రంగాన్ని అదానీ హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దాన్ని రైతులు అడ్డుకుంటున్నారని కూడా పోస్టులో రాసుకొచ్చారు ప్రియాంకగాంధీ వాద్రా.ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉద్యమం చేపడుతున్న రైతులను కొన్ని పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోడీ మంగళవారం వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారో నాడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని ప్రధాని మోడీ అన్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం చట్టంపై నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారని నేడు దేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే రైతులను పక్కదోవ పట్టించి రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ.
Fact Check
వాదన
రైల్వేలను అదానికి అప్పగిస్తున్నారంటూ ప్రియాంకా గాంధీ పోస్టు
వాస్తవం
రైలుపై అడ్వర్టయిజ్మెంట్ మాత్రమే అని పీఐబీ క్లారిటీ