Fact Check:జియో ఇంటర్నెట్ సేవలపై ఆ ప్రభుత్వం నిషేధం విధించిందా..?
కొద్ది రోజుల క్రితం పంజాబ్లో రిలియన్స్ జియో టవర్కు రైతులు నిప్పుపెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. అంతేకాదు రైతు నిరసనలకు మద్దతుగానే ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి డెహ్రాడూన్లో ఓ టవర్ అంటుకున్నట్లు స్పష్టమైంది. అది పంజాబ్లో జరిగిన ఘటన కాదని నిర్థారించడమైనది. కావాలనే ఎవరో రైతు నిరసనలకు పాత ఫోటోను అపాదించారనే నిజం వెలుగు చూసింది. ఈ ఘటన మరవక ముందే కేరళలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. కేరళ రాష్ట్రంలో జియో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ జోరుగా వార్త హల్చల్ చేస్తోంది.
ఈ వార్తను చూసిన కొందరు నెటిజెన్లు ప్రధాని మోడీకి, ముఖేష్ అంబానీలకు కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ధీటైన జవాబు ఇచ్చిందంటూ కామెంట్లు పెట్టారు. జియో ఇంటర్నెట్ సేవలపై కేరళ రాష్ట్రంలో నిషేధించడం జరుగుతోందని అదే సమయంలో ప్రభుత్వ ఇంటర్నెట్ సర్వీసు అయిన కేరళ ఫైబర్నెట్ను ప్రజలకు సగం ధరకే అందివ్వడం జరుగుతోందనే వార్త ప్రచారంలో ఉంది. ప్రచారంలో ఉన్న ఈ వార్త అవాస్తవమని వన్ ఇండియా చేసిన పరిశోదనల్లో తేలింది. అంతేకాదు ఒకవేళ నిజంగానే కేరళలో జియో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించినట్లయితే ఆ అంశం ప్రధాన వార్తల్లో నిలిచేది. కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఇదిలా ఉంటే కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కింద రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందివ్వాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్లతో జతకట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక టెలికాం సంస్థపై నిషేధం విధించరాదు.అదే సమయంలో ప్రతి రాష్ట్రంలో ఒక సర్వీస్ ప్రొవైడర్ తన కార్యకలాపాలు స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. అందుకే కేరళ ప్రభుత్వం రిలయన్స్ జియోపై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.
Fact Check
వాదన
రిలయన్స్ జియో ఇంటర్నెట్ సేవలపై కేరళ ప్రభుత్వం నిషేధం
వాస్తవం
వార్త అవాస్తవం.. టెలికాం నెట్వర్క్లపై ప్రభుత్వం నిషేధం విధించే హక్కు లేదు