Fact Check:జైడస్ కాడిలా సంస్థకు చేరేందుకు ప్రధాని మోడీ పంకజ్ పటేల్ కారులో ప్రయాణించారా..?
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కరోనావైరస్ కోసం తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఎంతవరకు వచ్చింది... వ్యాక్సిన్ సరఫరా ఎప్పుడు చేపట్టాలని తెలుసుకునేందుకు స్వయంగా ఆయన మూడు నగరాల్లో పర్యటించి సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాదులోని జైడస్ కాడిలా, హైదరాబాదులోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్లలో పర్యటించి శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ తయారు చేసే కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో స్వయంగా తెలుసుకున్నారు ప్రధాని మోడీ.
ఇదిలా ఉంటే దివ్యభాస్కర్ అనే వార్తా పోర్టల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి జైడస్ కాడిలా కంపెనీకి ఆ సంస్థ ఛైర్మెన్ పంకజ్ పటేల్కు చెందిన బీఎండబ్ల్యూ వాహనంలో చేరుకున్నారంటూ వార్తను ప్రచురించింది.అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజంలేదని పేర్కొంటూ ఈ వార్తను ప్రభుత్వం ఖండించింది. ప్రధాని నరేంద్ర మోడీ జైడస్ కాడిలాకు బీఎండబ్ల్యూ కారులో చేరుకోలేదని , ఆ బీఎండబ్ల్యూ కారు గుజరాత్ ప్రభుత్వంకు చెందినదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతే తప్ప ఆ కారు ఏ ప్రైవేట్ సంస్థకు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది.
Recommended Video
మార్చి 2021 నాటికల్లా వ్యాక్సిన్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు జైడస్ కాడిలా సంస్థ ఛైర్మెన్ పంకజ్ పటేల్ చెప్పారు. ఏడాదికి 100 మిలియన్ డోసులను తయారు చేస్తామని చెప్పారు. ఇక నవంబర్ 28వ తేదీన జైడస్ కాడిలా సంస్థకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ గంటపాటు కలియతిరిగారు. వ్యాక్సిన్ సంబంధించిన పూర్తి సమాచారంను అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాదు, పూణేలకు కూడా వెళ్లిన ప్రధాని ఆయా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Fact Check
వాదన
జైడస్ కాడిలాకు ఛైర్మెన్ కారులో ప్రధాని మోడీ చేరుకున్నారు
వాస్తవం
ప్రధాని మోడీ ప్రయాణించిన కారు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన బీఎండబ్ల్యూ కారు