Fact Check:పాక్ జెండాతో నటి రాఖీ సావంత్.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు
సోషల్ మీడియాలో కొన్ని వార్తల్లో ఎలాంటి నిజం లేకున్నా తెగ వైరల్ అవుతుంటాయి. ఇలా వైరల్ అవడంతో కొన్ని సందర్భాల్లో అనర్థాలు కూడా జరుగుతుంటాయి. ఇక సోషల్ మీడియా విస్తరిస్తుండటంతో దుష్ప్రచారాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటి ఈ ఫోటో... ఆ ఫోటోపై అంత చర్చ ఎందుకు జరుగుతోంది...
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఏది చేసినా వివాదాస్పదంగానే మారుతుంది. ఒకప్పుడు భారత దేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా పాకిస్తాన్ జెండాతో తాను దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజెన్లు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాఖీ సావంత్ మన దేశంపై ఉన్న ప్రేమ ఏంటో ఈ ఫోటోతో తెలిసిపోతోందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రాఖీ సావంత్ నిజస్వరూపం ఇదేనంటూ మరికొందరు కామెంట్స్ రాస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేదానిపై ఇప్పుడు చూద్దాం.
నటి రాఖీ సావంత్ పాకిస్తాన్ జెండాను తనపై కప్పుకోవడం అన్నది నిజమే. అయితే ఇది ఒక సినిమా షూటింగ్లో భాగంగా పాక్ జెండాను కప్పుకోవాల్సి రావడంతో అలా చేసింది. ధారా అనే సినిమా షూటింగ్లో భాగంగా పాకిస్తాన్ జెండాను రాఖీ సావంత్ తనపై కప్పుకుంది. ఆ సినిమాలో ఆమె పాకిస్తాన్ యువతిగా నటించింది. ఈ సినిమాలోని ఫోటో ఒకటి రాఖీ గతేడాది ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఇక ట్విటర్లో కూడా పోస్టు చేస్తూ తనకు భారత్ అంటే ఇష్టమని అయితే ధారా 370 చిత్రంలో పాక్ యువతి పాత్ర పోషించడంతో అలా జెండాను కప్పుకోవాల్సి వచ్చిందని ట్వీట్ చేసింది.
రాఖీ సావంత్ పోస్టుపై క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజెన్లు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పించడం మానలేదు. పాకిస్తాన్కు వెళ్లిపోవాల్సిందిగా కొందరు కామెంట్స్ చేశారు.మరికొందరైతే ఆమె పాకిస్తాన్ పౌరురాలిగానే ఉండాలని చెబుతూ ఆమె పేరు రాఖీ పాకిస్తానీ సావంత్ అని పోస్టుల్లో రాసుకొచ్చారు. మొత్తానికి ఫోటో మాత్రం నిజమే కానీ ఫోటో పై వస్తున్న వాదనలో నిజం లేదు.
Fact Check
వాదన
రాఖీ సావంత్ భారతీయురాలినే అని చెబుతుంది కానీ పాకిస్తాన్ జెండాతో కనిపిస్తోంది
వాస్తవం
వైరల్ అవుతున్న ఫోటో ధారా 370 అనే చిత్రంలోనిది.