Fact Check : 'ఇండియన్ ఆర్మీ'పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు నిజమేనా..?
ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఆయన భారత ఆర్మీని అవమానపరిచే వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చైనాతో సరిహద్దులో భారత ఆర్మీకి బదులు రైతులను,కార్మికులను అక్కడ మోహరించాలని రాహుల్ పేర్కొన్నారంటూ ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాహుల్ నిజంగానే భారత ఆర్మీని చులకన చేసే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా...?
కేవలం 26 సెకన్ల నిడివితో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వీడియోని చూస్తే పై ప్రశ్నకు అవుననే సమాధానం వ్యక్తమవొచ్చు. కానీ ఆయన పూర్తి ప్రసంగాన్ని వింటే అసలు విషయం అర్థమవుతుంది. దేశంలో కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేలు చేస్తూ రైతులు,కార్మికులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. రైతులు,కార్మికులు,నేతన్నలపై కూడా కేంద్రం దృష్టి పెట్టగలిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్లే చైనా భారత్లోకి చొరబడేందుకు తెగిస్తోందన్నారు. ఒకవేళ దేశంలోని రైతులు,కార్మికులు,నేతన్నలను కేంద్రం ప్రోత్సహించి స్వయం స్వావలంబన దిశగా సాగి ఉంటే... ఈరోజు భారత్లోకి చొరబడేంత ధైర్యం చైనాకు వచ్చి ఉండేది కాదన్నారు. 'ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది... నేను గ్యారెంటీ ఇస్తున్నా... రైతులు,కార్మికులు,నేతన్నలను బలోపేతం చేయగలిగితే,వారిని ఆదుకోగలిగితే,వారికి అవకాశాలు ఇవ్వగలిగితే... చైనా భారత్లోకి వచ్చే సాహసం చేయదు.' అని రాహుల్ పేర్కొన్నారు.
Recommended Video
దేశంలో చిన్న,మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయగలిగితే చైనా,దాని అధ్యక్షుడు కూడా భారత ఉత్పత్తులను వాడుతారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయట్లేదని... కేవలం నలుగురైదుగురు బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మేలు చేస్తోందని మండిపడ్డారు.
Fact Check
వాదన
రాహుల్ గాంధీ ఇండియన్ ఆర్మీని చులకన చేసే వ్యాఖ్యలు చేశారు.
వాస్తవం
ఆయన వ్యాఖ్యలను వేరే ఉద్దేశంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.