Fact Check:వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది హత్రాస్ అత్యాచార బాధితురాలేనా..?
ఉత్తర్ ప్రదేశ్: నిర్భయ ఘటన, దిశ ఘటన ఆ తర్వాత హత్రస్లో 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన...ఇలా వరుస ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్లోని హత్రస్లో ఓ 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఆస్పత్రిలో ఆ యువతి మృతి చెందింది. అయితే ఆ యువతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు న్యాయం చేయలాని కోరుతూ నెటిజెన్లు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ ఫోటోలో ఉన్నది మృతురాలు కాదు.
హత్రస్ బాధితురాలు ఈమేనంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాదు అందమైన ఈ అమాయకురాలిపై అత్యాచారం చేసి, నాలుకను కోసేసి, వెన్నెముకను గాయపరిచిన విధానం గురించి తలచుకుంటే గుండె పగిలిపోతోందంటూ ఓ సందేశం కూడా రాసి ఉంది. ఇలాంటి నరకం మరెవరికీ రాకూడదని రాసి ఉంది. సమాజంలో మార్పు రావాలని రాసి ఉంది. ఫోటోతో కూడిన ఈ మెసేజ్ కూడా వైరల్ అవుతోంది. మరోవైపు బాధితురాలి నాలుకను కోసేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేశారు.
Recommended Video
ముందుగా ఈ ఫోటో బాధితురాలిదే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో బాధితురాలిది కాదని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అన్నిటికంటే ముఖ్యమైనది అత్యచారంకు గురైన యువతి ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు. ఇప్పటికే దీనిపై కోర్టులు స్పష్టత ఇచ్చాయి. అత్యాచారం బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని శిక్షించాలని కోర్టులు చెప్పాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో గ్రహించాలని కోర్టులు సూచించాయి.
Fact Check
వాదన
హత్రస్ అత్యాచారం బాధితురాలి ఫోటో ఇదే
వాస్తవం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది హత్రస్ అత్యాచారం బాధితురాలు కాదు