Fake : ఆదానీ రైల్వే... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఫేక్..
కేంద్ర ప్రభుత్వం రైల్వేని కూడా ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి వైరల్గా మారింది. ఇందులో టికెట్పై ఆదానీ రైల్వే అని పేర్కొని ఉండటం... దాని ధర రూ.50గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రైల్వేని ఆదానీకి అమ్మేస్తే ప్లాట్ఫామ్ టికెట్ ధర ఇంతలా పెరగడంలో ఆశ్చర్యం ఏముంటుందని చాలామంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే రైల్వేని కేంద్రం ఆదానీకి అమ్మేయడంలో నిజమెంత... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టికెట్ నిజమైనదేనా...?
ఈ రెండింటికి కాదనే సమాధానమే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేని ఆదానీకి అమ్మలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుణే జంక్షన్ పేరుతో వైరల్ అవుతున్న ఆ ప్లాట్ఫామ్ టికెట్ ఈ ఏడాది అగస్టు నెలలోనూ వైరల్ అయింది. అయితే అప్పట్లో దానిపై ఆదానీ రైల్వే అనే పేరు లేదు. కేవలం పుణే జంక్షన్ అని మాత్రమే ఉంది. ఇక ధర విషయానికొస్తే.. అప్పట్లో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్టేషన్లో రద్దీని నియంత్రించే ఉద్దేశంతో ప్లాట్ఫాం టికెట్ను రూ.5 నుంచి రూ.50కి పెంచారు. దీంతో చాలామంది ఈ ప్లాట్ఫాం టికెట్ను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అదే టికెట్పై ఆదానీ రైల్వే అనే పేరును ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. దీన్నిబట్టి ఎవరో దీనిపై ఆ పేరును రాసి ఉంటారని తెలుస్తోంది. కేంద్రం రైల్వేని ఆదానీకి అమ్మేసిందని ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రచారం చాలాసార్లే జరిగింది. ఇటీవల ఓ రైలు బోగీపై ఆదానీ సంస్థ పేరున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అది ఫేక్ అని తేలింది. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న ఈ ప్లాట్ఫాం టికెట్ కూడా ఫేక్ అని తేలింది.
पुणे जंक्शन द्वारा प्लेटफार्म टिकट का मूल्य ₹50 रखने का उद्देश्य अनावश्यक रूप से स्टेशन पर आने वालों पर रोक लगाना है जिस से सोशल डिसटेनसिंग का पालन किया जा सके।
— Spokesperson Railways (@SpokespersonIR) August 17, 2020
रेलवे प्लेटफार्म टिकट की दरों को कोरोना महामारी के शुरुआती दिनों से ही इसी प्रकार नियंत्रित करता आया है। https://t.co/X2HuPC5HUg
Fact Check
వాదన
ప్లాట్ఫాం టికెట్పై ఆదానీ రైల్వే పేరు
వాస్తవం
ఇది మార్ఫింగ్ చేయబడిన ఫోటో. ఒరిజినల్ ఫోటోలో ఆదానీ రైల్వే పేరు లేదు.