Fake : భారత్ బంద్కు ముందు రోజు అంబానీతో పంజాబ్ సీఎం భేటీ...?
భారత్ బంద్(డిసెంబర్ 8)కు ముందు రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీతో భేటీ అయినట్లు ఓ కథనం,ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు,ఈ భేటీలో పంజాబ్లో రిలయన్స్ పెట్టుబడుల కోసం సీఎం అమరీందర్ ముకేష్ అంబానీతో మాట్లాడారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు ఆందోళనలకు,భారత్ బంద్కు మద్దతునిచ్చిన తరుణంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు.
అసలు విషయానికొస్తే... సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ ఫోటో ఇప్పటిది కాదు. అక్టోబర్ 31,2017లో అమరీందర్ సింగ్ ఓ సందర్భంలో ఆ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంబానీని కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన... పంజాబ్లో పెట్టుబడులు,పారిశ్రామిక అభివృద్దిపై ఆయనతో చర్చించినట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నారు.కాబట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ ఫోటో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ప్రచారంలో పెట్టారు.
కాగా,కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు గత 12 రోజులకు పైబడి ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(డిసెంబర్ 8) కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులతో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 8న దేశవ్యాప్త బంద్కు రైతులు పిలుపునివ్వగా బంద్ విజయవంతమైంది.
Fact Check
వాదన
భారత్ బంద్(డిసెంబర్ 8)కు ముందు రోజు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పారిశ్రామికవేత్త అంబానీని కలిశారు.
వాస్తవం
అందులో ఏమాత్రం నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో 2017కి సంబంధించినది.