Fact Check : భారత యుద్ద విమానాన్ని చైనా కూల్చివేసిందా...? ఇందులో నిజమెంత...?
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ ఫేక్ ప్రచారానికి కూడా తెరదీసింది. భారత్కు చెందిన సుఖోయ్ Su-30 యుద్ద విమానాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్లో పేల్చేసినట్లు అసత్య ప్రచారం చేస్తోంది. చైనాకు చెందిన జోంగ్ జిన్ అనే నిపుణుడు తన ట్విట్టర్లో బ్రేకింగ్ న్యూస్ పేరిట పీఎల్ఏ భారత యుద్ద విమానాన్ని పేల్చేసిందని పేర్కొన్నాడు.
చైనా చేస్తున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకూ అలాంటి సంఘటనేదీ చోటు చేసుకోలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. జిన్ అనే ఆ వ్యక్తి ట్విట్టర్లో చేస్తున్న ప్రచారం అబద్దమని పేర్కొంది. అంతేకాదు,ట్విట్టర్లో అతని బయో కూడా ఫేక్ అని పేర్కొంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వాంగ్ ఫెంగ్ ఫోటోను అతను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్గా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
ఈ సో-కాల్డ్ చైనీస్ నిపుణుడు తన ట్విట్టర్లో చైనాకు చెందిన ఎవరినీ ఫాలో కాకపోవడం గమనార్హం. అధ్యక్షుడు జిన్ పింగ్,అక్కడి అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ను కూడా అతను ఫాలో అవట్లేదు. కానీ తన ప్రొఫైల్లో మాత్రం తానో కాలమిస్టునని,చైనా-పాకిస్తాన్ అంశంపై ప్రత్యేక విశ్లేషకుడినని రాసుకున్నాడు.
అతని ప్రొఫైల్ను గమనిస్తే తన పోస్టుల్లో పాకిస్తాన్ను పొగడటం,భారత్పై బుదరజల్లడం కనిపిస్తోంది. గతంలో చాలాసార్లు మార్ఫింగ్ చిత్రాలు షేర్ చేసి భారత్పై బురదజల్లే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది అగస్టులో భారత మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ మార్ఫింగ్ ఫోటో ఒకటి షేర్ చేశాడు. పైగా అది ఇప్పటి త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఫోటోగా పేర్కొన్నాడు. ఇలా పొంతన లేని ఫోటోలు,పోస్టులతో అతను భారత్ను టార్గెట్గా చేయడం పనిగా పెట్టుకున్నాడు.
Breaking News: Our Air force has shutdown Indian fighter jet Sukhoi su–30 in Tibet.
— Zhong Xin 🇨🇳 (@ZhongXN) October 3, 2020
Fact Check
వాదన
భారత ఐఏఎఫ్ జెట్ను చైనా టిబెట్లో కూల్చేసింది.
వాస్తవం
అలాంటిదేమీ జరగలేదు..