ఫేక్ వెబ్సైట్ను బ్లాక్ చేసిన కేంద్రం... కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో మోసానికి తెరలేపిన పోర్టల్...
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్కు ఓ నకిలీ వెబ్సైట్ పుట్టుకొచ్చింది. రూ.4వేలు-రూ.6వేలు ధరతో కోవిడ్ 19 వ్యాక్సిన్ అందిస్తున్నామని... వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి డబ్బులు గుంజే ప్రయత్నం చేసిన ఈ నకిలీ వెబ్సైట్ వ్యవహారంపై కేంద్రం వెంటనే అప్రమత్తమై దీన్ని బ్లాక్ చేసింది.
ఆ వెబ్సైట్ పేరు 'https://mohfw.xyz'. ఇది ఫేక్ వెబ్సైట్ అని,ప్రజలు ఇలాంటి పోర్టల్స్ బారినపడి మోసపోవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. పొరపాటున కూడా ఇటువంటి వెబ్సైట్స్ను క్లిక్ చేయవద్దని... అందులోని తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని పేర్కొంది. సదరు వెబ్సైట్లో 'అపాయింటెమెంట్ ఫర్ వ్యాక్సినేషన్' అనే లింక్ ఇచ్చి... అందుకు గాను రూ.4వేలు నుంచి రూ.6వేలు వరకూ చార్జి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి డబ్బులు గుంజేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి మోసాలు జరుగుతాయని పసిగట్టే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టత ఇచ్చింది. కేవలం ఆరోగ్య సేతు యాప్,కో-విన్ యాప్స్ ద్వారానే వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇవి కాకుండా ఇతర వెబ్సైట్స్ లేదా యాప్స్లో రిజిస్ట్రేషన్కు అవకాశం లేదని తెలిపింది. కాబట్టి ఇలాంటి నకిలీ వెబ్సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు.
Fact Check
వాదన
రూ.4వేలు చెల్లించి కోవిడ్ 19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నకిలీ వెబ్సైట్ ప్రకటన
వాస్తవం
ఇది పూర్తిగా ఫేక్... కేంద్రం ఈ వెబ్సైట్ను బ్లాక్ చేసింది.