Fact Check : డిసెంబర్ 1నుంచి మళ్లీ లాక్డౌన్...? ఈ ప్రచారంలో నిజమెంత...
కేంద్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 1 నుంచి దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించబోతుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది.
దేశంలో మరోసారి లాక్డౌన్ విధించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్ను పోస్టు చేసిన పీఐబీ... అది మార్ఫింగ్ అని తేల్చింది. మరోసారి లాక్డౌన్ అంటూ అందులో పేర్కొన్న సమాచారంలో నిజం లేదని తెలిపింది.
నిజానిజాలు తెలుసుకోకుండా... చాలామంది ఇలాంటి ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. యూరోప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ లాక్డౌన్స్ విధిస్తుండటంతో ఇక్కడ కూడా అమలుచేస్తారేమోనని భావిస్తున్నారు. కానీ భారత్లో లాక్ డౌన్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
ప్రస్తుతం దేశంలో అన్లాక్ 5 నిబంధనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు కొనసాగనున్నాయి. సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాలను షరతులతో ఓపెన్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన కేంద్రం అనుమతినిచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.
Fact Check
వాదన
కేంద్రం డిసెంబర్ 1 నుంచి మరోసారి లాక్డౌన్ విధించబోతుంది.
వాస్తవం
కేంద్రం ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.