ఉంది ఒకేదారి!
భారత క్రికెట్ మరోసారి వివాదాల సుడిగుండలో చిక్కుకుంది. భారత జట్టు మాజీ కోచ్ జాన్ రైట్ రాసిన రాతలు వివాదానికి తెర తీశాయి. హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్మన్ వివియస్ లక్ష్మణ్ ఈ వివాదంలో ఒక కేంద్రం కావడం యాదృచ్ఛికమేమీ కాదు. లక్ష్మణ్ను పక్కన సెలెక్టర్లు పక్కన పెడుతూ వచ్చారని జాన్ రైట్ రాసి ఈ వివాదానికి తెర తీశారు. అయితే జాన్ రైట్ లక్ష్మణ్ ఎంపికను నిరాకరించడాని మాజీ సెలెక్టర్లు అంటున్నారు. జట్టు ఎంపికలో జోనల్ విధానాన్ని కూడా రైట్ తప్పు పట్టారు. లక్ష్మణ్ ఆటతీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే లక్ష్మణ్ను క్రమక్రమంగా జట్టుకు దూరం చేస్తూ రావడం యాదృచ్ఛికమేమీ కాదు. బెంగాలీ బాబుల ఆధిక్యత ఒక మంచి బ్యాట్స్మన్ స్థయిర్యాన్ని దెబ్బ తీసిందనడంలో సందేహం లేదు.
మొదటి నుంచి దక్షిణాది క్రికెటర్లు వివక్షకు గురి అవుతూనే వున్నారు. మొదట ముంబాయి ఆధిపత్యం, తర్వాత బెంగాలీ ఆధిపత్యం, ఇప్పుడు పంజాబీల ఆధిపత్యం ఈ వివక్షకు కారణం. అయితే కొంతలో కొంత ఈ వివక్షను కర్ణాటక అధిగమించింది. అయితే స్పిన్నర్ కుంబ్లే విషయంలో అది కొనసాగుతూనే వుంది. ఇక లక్ష్మణ్ విషయానికి వస్తే కెప్టెన్గా ఉన్న సౌరబ్ గంగూలీ లక్ష్మణ్ పట్ల అనుసరించిన తీరు అందరికీ తెలిసిందే. జాన్ రైట్ అప్పట్లో ఒకసారి అన్నట్లు సెలెక్టర్లు ఇచ్చిన జట్టు సభ్యులతో మెరుగైన ఫలితాలు రాబట్టడానికే ప్రయత్నించాడు తప్ప జట్టు ఎంపికలో పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు కనిపించలేదు. గంగూలీతో అతను సంబంధాలు చెడకుండా జాగ్రత్తపడడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియాకు అత్యంత ప్రీతిపాత్రుడైన గంగూలీకి అప్పట్లో తిరుగు లేదు. ఆటగాళ్ల పట్ల అతను వ్యవహరించిన తీరు కూడా పలు విమర్శలకు గురైంది. గంగూలీ నాయకుడిగా వున్నంత కాలం రాహుల్ ద్రావిడ్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లక్ష్మణ్కు జట్టులో ఉక్కపోసే పరిస్థితిని కల్పించడంలో గంగూలీ విజయం సాధించాడు. లక్ష్మణ్ భారత జట్టుకు కెప్టెన్ కాగలడనే అభిప్రాయం బలపడుతున్న సమయంలో, ఏదో ఒక మేరకు ఆ ప్రయత్నాలు జరిగిన సమయంలో గంగూలీ చక్రం తిప్పే పని మొదలు పెట్టాడని చెప్పవచ్చు. మొత్తం జట్టులో లక్ష్మణ్ ఎవరితోనూ కలివిడిగా ఉండలేని పరిస్థితిని కల్పించాడు.
లక్ష్మణ్ను పక్కకు పెట్టడానికే అన్నట్లు ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావును వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. సురేష్ రైనాతో పాటు వేణుగోపాల రావు జట్టులోకి వచ్చాడు. అయితే వేణుకు మైదానంలో తన ప్రతిభను ప్రదర్శించడానికి సరైన అవకాశమే రాలేదు. అదే సురేష్ రైనాను నిలకడగా ఆడించారు. మెల్లగా వేణును జట్టు నుంచి తప్పించారు. పంజాబీల ఆధిపత్యం జట్టులో పెరిగిపోతూనే వుంది. అందుకు బిసిసిఐ అధ్యక్షుడు శరద్పవార్ సన్నిహితుడి వల్ల జరుగుతుందనేది బహిరంగంగా వినిపిస్తున్న విమర్శ. దినేష్ మోంగియాను జట్టులోకి తీసుకోవడానికి ఇప్పుడు వేణును జట్టులోంచి తొలగించారనేది ప్రధానమైన విమర్శ. గతంలో కూడా లక్ష్మణ్ను దినేష్ మోంగియాను తీసుకోవడానికే తొలగించారనే మాట వినిపిస్తోంది. దినేష్ మోంగియా వేణు కన్నా, లక్ష్మణ్ కన్నా ఎక్కువగా రాణించిన సందర్భాలేమీ లేవు. అయినా దినేష్కు పెద్దల అండ అవకాశం కల్పించింది. ఆంధ్ర, హైదరాబాద్ ఆటగాళ్లకు బిసిసిఐలో గాడ్ ఫాదర్లు లేకపోవడం, రాజకీయ ప్రాబల్యం లేకపోవడం నష్టం కలిగిస్తోంది. గంగూలీని జట్టులోకి తీసుకోకపోతే పశ్చిమ బెంగాల్ సిపియం నాయకులంతా కదిలారు. తెలుగువారికి అంత పట్టింపు ఎక్కడుంది? అందుకే మన ఆటగాళ్లు ఎంతగా రాణించినా వారు నిలకడగా నిలదొక్కుకోవడానికి నైతికమైన, రాజకీయమైన మద్దతు ఏదీ లభించదు. సొంత ప్రతిభతో ఏదో రకమైన ప్రాబల్యం ఉంటే తప్ప జట్టులోకి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుంటుంది.