ఎబికె కూడా ఇంతగానా..?
ఒకప్పుడు ఆయన వర్గ రాజకీయాలను బలపరిచారు. ఆ విధంగా ఆయన వరవరరావు వంటి విప్లవ రచయితలు, మేధావులు, పౌరహక్కుల కార్యకర్తల మన్ననలు అందుకున్నారు. బహుశా వారంతా ఆయన ఓ పెద్ద దిక్కుగానే ఆయనను భావించి ఉంటారు. ఆ రాజకీయాలు నచ్చకపోతే ఆయన మౌనంగా ఉండిపోవచ్చు లేదా అందులోని లొసుగులను ఎత్తి చూపవచ్చు. కానీ ఆయన పాలక వర్గంలో చేరిపోయారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వర్గంలో చేరిపోయి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చాలా కాలం వెలగబెట్టారు. పాలకవర్గాలను తన పదునైన కలంతో చెండాడుతూ వచ్చిన ఎబికె కలం ఎదురు తిరిగి పాలక వర్గ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతూ వచ్చింది.
ఇకపోతే, ఆయన ఇటీవల పూర్తి తెలంగాణ వ్యతిరేకిగా మారిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వ్యతిరేకిస్తూ ఆయన ఓ పెద్ద పుస్తకం రాసి తన సీమాంధ్ర రుణం తీర్చుకున్నారు. అయితే, అదృష్టం కొద్దీ గతంలోని ఎబికె రచనలకు దొరికిన గౌరవం ఈ రచనకు దొరకలేదు. దాంతో ఆగకుండా తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను భస్మాసుర హస్తంగా అభివర్ణిస్తూ ఓ ఎన్నారై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధపడ్డారు. నల్లమోతు చక్రవర్తి అనే రచయిత ఆ పుస్తకం రాశారు. ఈ నల్లమోతు చక్రవర్తిని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందినవాడిగా చెబుతున్నారు. కానీ ఆ నల్లమోతు చక్రవర్తి మూలాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని హాలియాకు వలస వచ్చారు. వస్తే వద్దనేది లేదు, కానీ ఈ ప్రాంత ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించడమే అభ్యంతర కరం. సమస్యకు మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆంధ్ర నుంచి తెలంగాణకు వలస వచ్చినవారు స్థానిక ప్రజలతో మమేకం కాకుండా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుండడం, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడి వనరులను, మానవ శక్తిని కొల్లగొట్టడం ప్రధాన సమస్య. ఆ రకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై పెద్ద వేటు వేశారు. నల్లమోతు చక్రవర్తి చేసిన పని కూడా అదే.
ఇదిలా ఉంటే, నల్లమోతు చక్రవర్తి అమెరికాలో సమైక్యాంధ్ర ఉద్యమానికి బలం చేకూర్చడానికి పెద్ద డబ్బులు వసూలు చేసినట్లు రాజ్ న్యూస్ వార్తాకథనంలోని ఓ అభిప్రాయం. నల్లగొండ జిల్లాలోని హాలియా మండలం చింతలగూడెంలో ఆయన తొలుత స్థిరపడ్డాడు. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన అతను రేపల్లెకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురిని వివాహమాడాడు. తెలంగాణలో దాదాపు 300 ఎకరాల వరకు అతను కొనుగోలు చేసినట్లు ఓ ఆరోపణ ఉంది. దాన్ని రక్షించుకోవడానికి తాజాగా అతను ఈ పుస్తకంతో రంగప్రవేశం చేశాడు. అతని చరిత్రను బట్టి చూస్తే, ఎబికె ప్రసాద్ ఏ సంపన్నవర్గాల సరసన నిలబడుతున్నాడో, ఏ సంపన్న వర్గాల ప్రయోజనాలకు హేతుబద్దత కల్పించడానికి పూనుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే, తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు చేస్తున్న బలిదానాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఓ మేధావిగా, జర్నలిస్టుగా ఎబికెకు లేదా. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మంచిచెడుల గురించి ఆలోచించే చారిత్రక భౌతిక వాద జ్ఞానం ఆయనలో గడ్డకట్టుకుపోయిందా.