ఏది ప్రాంతీయవాదం?
కలిసి ఉండాలని కోరుకునేవారు రెండు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను సమదృష్టితో చూడాల్సి ఉంటుంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని, తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని వాదిస్తున్నప్పుడు వారి వాదనను వినాల్సి ఉంటుంది. ఆ వాదన సమంజసంగా ఉందా, లేదా అని ఆలోచించాల్సి ఉంటుంది. వారి వాదనలో పస లేకపోతే నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. ఆ వాదన సమంజసంగా ఉందని భావిస్తే అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే వారికి తెలంగాణ ప్రాంత ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షనే తీసుకుందాం. తమకు అన్యాయం జరుగుతోందని నెల రోజులుగా తెలంగాణ విద్యార్థులు మొత్తుకుంటున్నారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చి, ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను చూపిస్తున్నారు. తెలంగాణేతర ప్రాంత అభ్యర్థులకు రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వచ్చిన ఉదంతాలను చూపిస్తున్నారు. ఇది పక్షపాత ధోరణి అంటున్నారు. అంతేకాకుండా, ఎపిపిఎస్సీలో తమకు దక్కాల్సిన న్యాయమైన 42 శాతం వాటా తేల్చాలని అంటున్నారు. వారి వాదనలో ఏమైనా హేతబద్దతు ఉందా, లేదా అనే పరిశీలించాల్సిన అవసరం సీమాంధ్ర నాయకులకు లేదా అనే ప్రశ్న వేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఏకపక్షంగా పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ వైఖరి తప్పు కాదా అనేది కూడా ప్రశ్న.
తెలంగాణ విద్యార్థులు ఓ వాదన ముందు పెడుతున్నప్పుడు వారిని చర్చలకు పిలిచి వారి అనుమానాలను తీర్చాల్సిన అవసరం లేదా మహారాజశ్రీ ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి ఉందా, లేదా అనేది ప్రశ్నించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వేర్పాటువాదులు, ప్రాంతీయవాదులు అని ముద్రలు వేసి తమ పబ్బం గడుపుకోవాడనికి ఒక ప్రాంత ప్రయోజనాలను మాత్రమే కాపాడుకోవడానికి వ్రయత్నంచేవారు విశాలదృక్పథం కలవారు ఎట్టి పరిస్థితిలోనూ కాలేరు. వారే ప్రాంతీయవాదులు అవుతారు. సంకుచితవాదులు అవుతారు. కలిసి ఉండాలని కోరుకునే వారు అనుసరించే వైఖరి కూడా అది కాదు. మీ మాటలు వినం, మిమ్ముల్ని పట్టించుకోం, మీరు మా మాట వినండి, మేం చెప్పేదే నిజం అనే ఆధిపత్య ధోరణిని సహించలేని స్థితికి తెలంగాణ చేరుకుందనే విషయాన్ని గుర్తించడం లేదు. అలా గుర్తించే స్థితిలో కూడా వారు ఉన్నట్లు లేరు. సమైక్యవాదం పేర సీమాంధ్ర నాయకులు, మేధావులమని చెప్పుకునే శామ్యూల్ లాంటి వారు పక్కా సంకుచిత వాదులుగానూ ప్రాంతీయవాదులుగానూ మిగిలిపోతారు.