బాబుకు కెసిఆర్, కాంగ్రెసుకు గద్దర్
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను పలువురిని ఆయన పార్టీలోకి అహ్వానిస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు వరుసగా తెరాసలో చేరుతున్నారు. వారితో పాటు తెరాసలోకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా వస్తుందని కెసిఆర్ భావిస్తున్నారు. కెసిఆర్ ను ఎదుర్కోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చంద్రబాబును తప్పు పట్టడానికి కెసిఆర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని సమర్థించేంత వరకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు సోనియా ఇంటి ముందు కాకుండా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని ఆయన అన్నారు. అంతేకాకుండా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేశారని ఆయన చెప్పారు. చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పిస్తే తాను సోనియా ఇంటి ముందు ధర్నాకు వస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తెలంగాణపై రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారంటూ ఎడతెరిపి లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆత్మరక్షణలో పడింది.
కాగా, కాంగ్రెసును వదిలేసి తెలుగుదేశంపై పడిన కెసిఆర్ ను గమనించే కావచ్చు గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కాంగ్రెసును టార్గెట్ చేసుకుంది. తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెసు పార్టీయే ద్రోహం చేస్తూ వస్తోందని గద్దర్ విమర్శించారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీకి ఉంటుందని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. గద్దర్ మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తామని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కేశవరావు అన్నారు. గద్దర్ తో కలిసి పనిచేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఈ మాటలను బట్టే కాంగ్రెసు ఆత్మరక్షణలో పడిందని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభల పేరుతో తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెసు నాయకులు గద్దర్ ప్రవేశం ఆటంకంలాంటిదే. ఏమైనా, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు కెసిఆర్, గద్దర్ కొరకరాని కొయ్యలుగా మారే అవకాశం ఉంది.