భూముల వల్లనే హైదరాబాద్ వివాదం?
ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాల అమలు వేగవంతమైన తర్వాత, నిరర్థక ఆస్తుల అమ్మకం పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం పెంచిన తర్వాత హైదరాబాదు స్వరూప స్వభావాల్లో మార్చు వచ్చింది. హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని స్థానికులు భూములు కోల్పోతూ వచ్చారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు పెద్ద యెత్తున ఈ ప్రాంతాల్లో భూములు స్వాధీనం చేసుకున్నారు. బహుశా, డబ్బులు పెట్టే కొన్నారని కూడా అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ విధానాల్లోని వెసులుబాటును వాడుకుని తక్కువ ధరలకు కూడా చాలా మంది భూములు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, హైదరాబాదు ఇందులో ఉంటే ఆ భూములు మరోసారి వివాదంగా మారవచ్చు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుతోనే ముగిసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములపై పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దాని వల్ల హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని భూముల లెక్కలు తేల్చే పరిస్థితి రావచ్చు. ఎకరాల కొద్ది సొంత చేసుకున్న సీమాంధ్ర రాజకీయ నాయకుల భూములకు ఎసరు రావచ్చు. సీమాంధ్ర రాజకీయ నాయకులకు ఈ భయం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖపట్నం, చిత్తూరు వంటి ప్రజలకు హైదరాబాదు అందుబాటులో లేదు. ఆ జిల్లాలకు చెందినవారు ఎంత మంది సామాన్య, పేద ప్రజలు హైదరాబాదును చూశారనే లెక్కలు తీస్తే ఆశ్చర్యకరమైన గణాంకాలే రావచ్చు. హైదరాబాదు పీటముడి సీమాంధ్ర ప్రజల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్లనే అనేది చెప్పకుండానే తెలిసే పరిస్థితి ఉంది.