వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాల విధ్వంసం వెనక..

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Tank Bund Statues
తెలంగాణ ఉద్యమం వల్ల ఇప్పటికే ఓ విగ్రహ విధ్వంసం జరిగింది. తెలంగాణ ఉద్యమం సాధించిన ఘనత అది. హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ మీది విగ్రహాల ధ్వంసాన్ని సీమాంధ్ర రాజకీయ నాయకులు, మేధావులు గుర్తించారే గానీ ఇప్పటికే జరిగిన ఆ విగ్రహ విధ్వంసాన్ని గుర్తించినట్లు లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వెలిసి, ఊపిరి సలపకుండా చేసి ఉండేవే. తెలంగాణ ఉద్యమం వల్ల అది సాధ్యం కాలేదు. పేద ప్రజల బాంధవుడిగా, మహానేతగా అభివర్ణిస్తూ తన తండ్రి విగ్రహాలను రాష్ట్రమంతటా స్థాపించడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారు. సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఆ విగ్రహాలు ఇప్పుడు అట్టహాసంగా నిలబడి ఉన్నాయి. కొన్ని చోట్ల మహాత్మా గాంధీ విగ్రహాల కన్నా ఎత్తుగా ఉన్నాయి. అయితే, తెలంగాణ ఉద్యమం బలహీనంగా ఉండి, సీమాంధ్ర సరిహద్దులను ఆనుకుని ఉన్న నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైయస్సార్ విగ్రహాలు వెలిశాయి.

తెలంగాణలో కాలు పెట్టడానికి ప్రయత్నించిన వైయస్ జగన్‌కు తెలంగాణ ఉద్యమ వేడి బలంగానే తాకింది. దాంతో వైయస్ విగ్రహాల ఆవిష్కరణ ఉత్సవాలు తెలంగాణలో ముందుకు సాగలేదు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంసాన్ని ఇదే కోణం నుంచి చూద్దామా, వద్దా అనేది ప్రశ్న. ఎందుకంటే, అక్కడ కొలువైన విగ్రహాలన్నీ ఏదో మేరకు సమాజానికి సేవ చేసినవి. తెలంగాణకా, సీమాంధ్రకా అనే విషయాన్నీ, సంపన్నవర్గాలకా, దళిత వర్గాలకా అనే మీమాంసనూ పక్కన పెట్టి చూస్తే కూడా ఏదో మేరకు అవి ఆరాధనీయమైనవారి విగ్రహాలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముక్కోటి దేవతల సాక్షిగా, నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమం సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ మహానుభావులు జీవించి ఉంటే ఎలా స్పందించి ఉండేవారనే ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు. ఒక్క విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. ప్రస్తుత రాజకీయ చట్రాన్ని, సామాజిక చట్రాన్ని, ఆధిపత్య సాంస్కృతిక చట్రాన్ని కూల్చివేసే అవకాశాన్ని సీమాంధ్ర రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చారు.

ప్రస్తుత చట్రంలోనే ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉద్యమ రూపం దాల్చిన ప్రజాస్వామిక ఆకాంక్షను తీర్చి ఉంటే తెలంగాణ ప్రజలకు అంతటి మంచి అవకాశం లభించి ఉండేది కాదు. చట్టపరిధిలో జరగాల్సిన వ్యవహారాలు, ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన పనులు కూడా జరగకపోవడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఆ అసహనం తప్పు దారి పట్టకుండా గత పదేళ్లుగా ఉద్యమం జాగ్రత్తగా జరుగుతూనే ఉన్నది.

కాగా, ఆధిపత్య సంస్కృతికి ప్రతీకగా ఉన్న విగ్రహాలను మాత్రమే తెలంగాణవాదులు ట్యాంక్‌బండ్‌పై విధ్వంసం చేశారనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మహానుభావుల సేవలను తగ్గించి చూపడమో, వారిని అవమానించడమో ఎంత మాత్రం కాదు. మహానుభావులను అడ్డం పెట్టుకుని సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు, సంపన్నవర్గాలకు ఆ విగ్రహాలు ప్రతీకగా మారాయి. తమ ప్రజాస్వామిక డిమాండుకు సీమాంధ్ర వర్గాలు అంగీకరించి ఉంటే ఆ విగ్రహాలకు ఏ మాత్రం విఘాతం కలిగి ఉండేది కాదు. విగ్రహాలు స్థాపించినవారు ఆ మహానుభావుల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది తెలంగాణవాదుల నమ్మకం.

English summary
A columnist K Nishanth expressed his opinion on distruction tank bund statues in Hyderabad during million march. He said that the incident was occurred due to hegemony of Seemandhra industrialists attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X