తెలంగాణ సమ్మెపై కిరణ్ ప్రాంతీయ పాచిక
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల కరెంట్ కోత విధించాల్సి వస్తుందని చెబుతూ తెలంగాణలోనే పంపుసెట్లు ఎక్కువగా ఉన్నాయని, దానివల్ల తెలంగాణలో వ్యవసాయం దెబ్బ తింటుందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. రహదారులను దిగ్బంధించడం వల్ల, ఆర్టీసి సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే ఇబ్బందులు పడుతారని కూడా ఆయన అన్నారు. మొత్తమ్మీద సమ్మెను విచ్ఛిన్నం చేసే వ్యూహంలో భాగంగానే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. సమ్మెను పరిష్కరించడానికి రాజకీయ పార్టీల నాయకులతో గానీ, సమ్మె చేస్తున్న నాయకత్వాలతో గానీ చర్చించడానికి ముందుకు రాకుండా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను మనసును మార్చే కార్యక్రమానికి ఒడిగట్టారని స్పష్టంగానే అర్థమవుతోంది.
వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు విమర్సిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలంగా లేకపోతే సమ్మె ఇంత ఉధృతంగా ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రజలు సమ్మె వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు సాగవని కూడా చెబుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల శాసనసభ్యులను ఒక్క చోట కూర్చోబెట్టే స్థితి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి లేదని స్వయానా కాంగ్రెసు పార్టీ నాయకుడు కేశవరావే అన్నారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలను దృష్టి ఉంచుకుని పని చేయాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి మీ ప్రాంతం అనే విధంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్లీనంగా సీమాంధ్ర నాయకులకు తెలంగాణ పట్ల ఉన్న ఈ వివక్షనే ప్రస్తుత పరిణామాలకు కారణమనే మాట వినిపిస్తోంది.