సాక్షి, జగన్లపై దాడి, రాజకీయ కుట్ర
సాక్షిపై దాడిపై ఆ పార్టీలు మాట్లాడడం లేదు. దీన్ని బట్టి వాటి ఉద్దేశమేమిటో అర్థమవుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో, అంబానీ సోదరులతో, రామోజీరావుతో కుమ్మక్కయ్యారు. సిబిఐ, ఇడి అందులో భాగమయ్యాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదే. వెనక్కి తిరగలేని స్థితికి చేరుకున్నామని ప్రజానీకం, సమాజం గుర్తించాల్సిన సమయం వచ్చింది.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రజాస్వామిక విలువలు పతనమయ్యాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి స్వతంత్ర సంస్థల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. బూటకపు నాటకాలు బయటపడుతున్నాయి. జగన్ ఏ రోజు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కారు. అటువంటి వ్యక్తి అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడుతారు. అటువంటి జగన్పై చర్యలు ఎలా తీసుకుంటారు. తన ప్రభుత్వ హయాంలో ఎన్నో కుంభకోణాలకు కారణమైన చంద్రబాబు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతాడు.
మన ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఎటు నడిపిస్తున్నాయి. వారికి దేశమంటే, దేశప్రజలంటే భయం లేదు. సోనియా గాంధీ ప్రోద్బలంతో శంకరరావు రాసిన రెండు పేజీల లేఖను కోర్టు విచారణకు స్వీకరించింది. దానిపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. చంద్రబాబుపై విజయలక్ష్మి దాఖలు చేసిన 2 వేల పేజీల పిటిషన్ మాత్రం తిరస్కరణకు గురైంది.
గత 20 ఏళ్లుగా జరిగిన అన్ని కుంభకోణాలపై, అవినీతి కార్యక్రమాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తి స్థాయి విచారణను కోరుతోంది. అప్పుడు ఒక్క జగన్ విషయమే కాదు, అందరి విషయం బయటపడుతుంది. చంద్రబాబు ద్వారా ప్రయోజనం పొంది ఈనాడులో కోట్లాది రూపాయలు పెట్టబడిగా పెట్టిన అంబానీ విషయం కూడా వెలుగులోకి వస్తుంది. చంద్రబాబు తన అనుయాయులకు, ముఖ్యంగా బెల్లీ రావుకు భూములు కేటాయించిన విషయం కూడా వెలుగు చూస్తుంది.
వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపరుడైతే రెండోసారి ఆయనను కాంగ్రెసు పార్టీ ఎందుకు ముఖ్యమంత్రిని చేసింది. కాంగ్రెసు పార్టీని 2004లో, 2009లో రెండుసార్లు వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి తెచ్చారు. వైయస్ మరణం తర్వాత సోనియా పిరికిగా వ్యవహరిస్తున్నారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే చంద్రబాబుతో పాటు సోనియా గాంధీ విచారపడాల్సి వస్తుంది.
- గురువా రెడ్డి, అట్లాంటా