కాలమ్: చిరంజీవిపై సోనియా అతి విశ్వాసం
మంత్రి పదవులకు ఎంపిక చేసుకున్న పార్లమెంటు సభ్యులను చూస్తే కాంగ్రెసు పార్టీకి ముందు చూపు లేదనేది తెలిసిపోతుంది. ఇది అత్యంత అనాలోచితమైన చర్య. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా ప్రదర్శించడం లేదు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేయడం, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకోవడం, వైయస్ జగన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడం అటువంటి చర్యలే.
2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికనూ పరిశీలిస్తే రాజకీయ సీనియారిటీ విషయంలో కనీస ప్రమాణాలను పాటించలేదని తెలిసిపోతుంది. అయితే, సోనియా, రాహుల్ గాంధీలు వైయస్ జగన్ను లక్ష్యం చేసుకున్నారనేది మాత్రం అర్థమవుతుంది. కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివ రావు వంటి సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకంటే, ఆ సీట్లలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచే అవకాశాలు లేవు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగి ఆ సీట్లలో తమ పార్టీ మట్టి కరుస్తుందని కాంగ్రెసు పెద్దలకు తెలుసు.
కేంద్ర మంత్రి పదవులకు కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని, తెలుగుదేశం బలంగా లేని సీట్లలో గెలిచిన పార్లమెంటు సభ్యులను ఎంపిక చేసుకుంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ సీట్లలో గట్టి పోటీ ఇవ్వాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచన. అందువల్లనే మంత్రి పదవులకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లను ఎంపిక చేసుకుంది.
చిరంజీవి కుల సమీకరణాల్లో అమలాపురం లోకసభ సీటును గెలిపించుకుంటామని సోనియాకు హామీ ఇచ్చి ఉంటారు. ఉప ఎన్నికతల్లో నర్సాపురం, రామచంద్రాపురం సీట్లలో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ అదే రీతిలో అమలాపురం లోకసభ సీటును గెలుచుకంటామని చిరంజీవి అధిష్టానానికి చెప్పి ఉంటారు. అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది కేంద్ర మంత్రులు ఉంటే, పది సీట్లు కనీసం గెలుచుకుంటామనే రాహుల్ గాంధీ ఆలోచన పరిపక్వమైంది కాదు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ రాహుల్ గాంధీ విఫలమవుతారు.
వచ్చే ఎన్నికల్లో చిరంజీవి గట్టి పోటీ కూడా ఇవ్వలేరనే విషయం సోనియా గాంధీకి అర్థమయ్యే అవకాశం లేదు. వైయస్సార్ కుమారుడు వైయస్ జగన్ను దెబ్బ తీసే ఆలోచనతోనే కాంగ్రెసు రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకత్వాలు ఆలోచన చేస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి శ్రమ కారణంగానే గెలిచామనే విషయం మరిచిపోయి పాత, కొత్త మంత్రులు సోనియా గాంధీ వద్ద, రాహుల్ గాందీ వద్ద మోకరిల్లుతున్నారు. అయితే, కేంద్ర మంత్రులు ఎవరూ గెలిచే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తిరుగు లేని దెబ్బ తగులుతుంది.
గురువారెడ్డి,
విశ్వనాథ్
వైయస్సార్
కాంగ్రెసు
పార్టీ
(ఈ ఆర్టికల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై ఎవరైనా రాస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యాసంలోని అభిప్రాయాలపై రాసే వ్యాఖ్యలను [email protected] అనే మెయిల్కు పంపించండి. అభిప్రాయాలను ఒక్కటి రెండు వాక్యాల్లో కూడా వ్యాసరూపంలో వ్యక్తం చేయాలని మనవి.)