ఆడలేక, చిరంజీవి పేరుతో ఆడిపోసుకున్నాయి
ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, ప్రజారాజ్య పార్టీ మధ్య చీలిపోయి కాంగ్రెసు పార్టీ విజయం సాధించిందనే వాదనను ముందుకు తెచ్చింది. దీనిపై లోతుగా ఆలోచన చేసి, అసలు విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో రాష్ట్రంలోని బలమైన కాపు, బలిజ కమ్యూనిటీ ఆశలు మోసులు వేశాయి. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉండే ఆ సామాజిక వర్గాలు మొదటి నుంచి కాంగ్రెసు వెంట ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి.
2009 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాలు గుండు గుత్తగా ప్రజారాజ్యం పార్టీకి ఓటేశాయి. దానివల్ల కాంగ్రెసు పార్టీకే నష్టం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపన జరిగి ఉండకపోతే కాంగ్రెసు పార్టీ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు కాంగ్రెసు పార్టీ ఊడ్చి పెట్టి ఉండేది. దానివల్ల రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి 200కు పైగా శానససభా స్థానాలు వచ్చి ఉండేవి.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 92 సీట్లు గెలిచింది. అయితే, ఎప్పుడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 28కి పడిపోయింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన సామాజిక వర్గాలన్నీ ఆ పార్టీకి దూరం కావడంతో తగిన ఫలితాలు సాధించలేకపోయింది.
రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 33 సీట్లు గెలిచిన కాంగ్రెసు పార్టీ ఆ మేరకు, ఆ నిష్పత్తిలో శాసనసభా స్థానాలను గెలుచుకోలేకపోయిందనే వాదన ఉంది. ఈ వాదనకు ఏ మాత్రం బలం లేదు. ప్రతి లోకసభ స్థానంలో ఏడు శాసనసభా స్థానాలున్నాయి. కాంగ్రెసు పార్టీకి 37 శాతం, తెలుగుదేశం పార్టీకి 28 శాతం, ప్రజారాజ్యం పార్టీకి 16 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెసు 156, తెలుగుదేశం 92, ప్రజారాజ్యం 18 స్థానాలు గెలుచుకున్నాయి.
ఒక లోకసభ స్థానంలోని శానససభా స్థానాల్లో లభించిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తే కాంగ్రెసుకు పూర్తి ప్రయోజనం చేకూరే విధంగానే ఉందని అర్థమవుతుంది. కాంగ్రెసు పార్టీ ప్రతి లోకసభ స్థానంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నిజానికి కాంగ్రెసు పార్టీ మరో మూడు ఎంపి స్థానాలను గెలుచుకోవాల్సి ఉండింది. అయితే, మెజారిటీలు తక్కువగా ఉండడంతో, కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అనూహ్యమైన మెజారిటీలో ఇతర పార్టీలకు లభించడంతో అది సాధ్యం కాలేదు.
అయితే, వాస్తవాలను గ్రహించకుండా తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప్రజారాజ్యం పార్టీని సాకుగా చూపి ఓటమి నుంచి ఊరట పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి.
- గురువారెడ్డి, అట్లాంటా