ఆ స్టోరీ నిజమైంది: రాజ్యసభకు విహెచ్ నామినేట్
పాత్రికేయ రంగానికి సంబంధించి వారం వారం నా అనుభవాలను అందించే క్రమంలో ఈ వారం మరో ఆసక్తికరమైన కథనాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఉదయం దినపత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నా కాలం. నేను తెలుగుదేశం వ్యవహారాలు చూస్తూ ఉండేవాడిని. కవుటూరి శేషు అనే నా మిత్రుడు అధికార కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు చూస్తుండేవాడు.
అప్పుడు కె. రామచంద్రమూర్తి ఎడిటర్గా ఉన్నారు. ఆయనకో ఆలోచన వచ్చింది. ప్రతి ఆదివారం యాంకర్ స్టోరీగా, అంటే పత్రిక మొదటి పేజీలో కింది భాగంలో ఓ వార్తాకథనం రాయాలనేది ఆలోచన. తన ఆలోచనను బ్యూరోకు చెప్పారు. ఆ రాజకీయ వార్తాకథనానికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాన్ని కూడా ఆయన వివరించారు.
అది గాసిప్ అయి ఉండాలి. కానీ వాస్తవానికి పూర్తిగా దూరంగా కూడా ఉండకూడదు. నిజానికి, ఇది రిపోర్టర్కు కత్తి మీద సాము వంటిది. ఓ వారం కవుటూరి శేషు రాయాల్సి వచ్చింది. శనివారంనాడు రాస్తే ఆదివారంనాటి పత్రికలో అది అచ్చయ్యేది. ఆ శనివారం శేషు సెలవులో ఉన్నాడు. దాంతో అది రాయాల్సిన బాధ్యత నా మీద పడింది.
ఏం రాయాలా అని తలమునకలవుతున్న సమయంలో శేషు ఓ చిన్న సూచన చేశాడు. దాన్ని అందుకుని నేను కాంగ్రెసుపై వార్తాకథనాన్ని అల్లాను. అప్పుడు ఎన్. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారనుకుంటా. ఆయనకూ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వి హనుమంతరావుకు మధ్య క్షణం పడేది కాదు. ఒక రకంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నిజానికి, కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడికీ ముఖ్యమంత్రికీ మధ్య విభేదాలు సాధారణంగానే ఉండేవి.
కానీ, విహెచ్కూ జనార్దన్ రెడ్డికీ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దాన్ని ఆసరా చేసుకుని వార్తాకథనం రాశారు. విభేదాలకు పరిష్కారంగా విహెచ్ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకుంటారని, ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే లైన్ను ఆసరా చేసుకుని వార్తాకథనం రాశాను. నిజంగానే విహెచ్ను కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజకీయ వార్తాకథనాల్లో ఊహకు లేదంటే గాసిప్కు లాజిక్ జోడిస్తే నిజమే అనిపించేలా ఉండాలి. ఒక్కోసారి అవి నిజం కూడా కావచ్చు. అలాంటిదే విహెచ్పై వార్తాకథనం కూడా.
అది యాదృచ్ఛికంగా జరిగిందా, నా వార్తాకథనం చదివిన తర్వాత స్థానిక నాయకుల సలహా మేరకు కాంగ్రెసు అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటు ఉందా అనేది ఇప్పటికీ తేల్చుకోలేని విషయమే. కానీ అప్పటి నుంచి విహెచ్ రాజ్యసభకు వరుసగా వెళ్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం కాంగ్రెసుకు తగిన బలం లేకపోవడం వల్ల ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశం దెబ్బ తిన్నది.
- కాసుల ప్రతాపరెడ్డి