‘జియోగ్రఫిక్ బీ’గా కరణ్, సెకండ్ తెలుగమ్మాయి
వాషింగ్టన్: అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'నేషనల్ జియోగ్రఫిక్ బీ' పోటీలో 14ఏళ్ల భారత అమెరికన్ విద్యార్థి కరణ్ మీనన్ విజేతగా అవతరించాడు. కాగా, తెలుగు అమ్మాయి శ్రియ యార్లగడ్డ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈ పోటీలో మొదటి మూడు స్థానాలను భారత సంతతి వారే కైవసం చేసుకోవడం మరో విశేషం.
అంతేకాదు, ఫైనల్స్కు చేరిన 10 మందిలో భారత సంతతివారు ఏడుగురు ఉన్నారు. నేషనల్ జియోగ్రఫిక్, ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ పోటీ జరిగింది.అమెరికాలో 11వేల పాఠశాలల్లో చదువుతున్న 40 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 14 ఏళ్ల కరణ్.. న్యూజెర్సీలో 8వ తరగతి చదువుతున్నాడు.
ఈ పోటీలో గెలుపొందినందుకు మీనన్కి 85వేల డాలర్ల కళాశాల ఉపకారవేతనం, నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం, నౌకలో గాలాపాగోస్ దీవులకు విహారయాత్ర ఉంటాయి. మొదటి రన్నరప్గా నిలిచిన 11 ఏళ్ల శ్రియ.. మిషిగన్లో ఉంటోంది. ఆరో తరగతి చదువుతోంది. ఆమెకు 25 వేల డాలర్ల కళాశాల ఉపకారవేతనం లభిస్తుంది.
మూడోస్థానంలో నిలిచిన సోజస్ వాగ్లే (13)కు 10వేల డాలర్ల కళాశాల ఉపకారవేతనం దక్కుతుంది. ఛాంపియన్షిప్ రౌండ్లోని ఏడు ప్రశ్నలకు కరణ్ సమాధానమిచ్చాడు. ఇందులో తెలంగాణ, తాష్కెంట్, ఒరెసండ్ జలసంధి తదితర ప్రదేశాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు.
తనకు భూగోళ శాస్త్రమంటే ఇష్టమని, అదే తనను ప్రపంచ పౌరుడిగా నిలబెట్టిందని విజేతగా నిలిచిన కరణ్ మీనన్ తెలిపారు. కాగా, శ్రియ.. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో ఆమె ద్వితీయ స్థానంలో నిలిచింది. మొదటి రన్నరప్గా నిలవడం తనకు సంతోసంగా ఉందని తెలిపింది. కాగా, గత కొంత కాలంగా అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీలలో భారత సంతతి విద్యార్థులే విశేష ప్రతిభ చూపుతూ విజేతలుగా నిలుస్తున్నారు.