మనిషా? చెట్టా? "ఈ వ్యాధి పగవాళ్ళకు కూడా రాకూడదు"
ఒళ్ళంతా చెట్టు బెరడులాంటి పెద్ద పెద్ద మొటిమలతో 'ట్రీ మ్యాన్ 'గా ప్రసిద్ధి చెందిన, బంగ్లాదేశ్ కు చెందిన అబుల్ బజందర్ 16 సర్జరీల అనంతరం త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నాడు.
ఢాకా: ఒళ్ళంతా చెట్టు బెరడులాంటి పెద్ద పెద్ద మొటిమలతో 'ట్రీ మ్యాన్ 'గా ప్రసిద్ధి చెందిన, బంగ్లాదేశ్ కు చెందిన అబుల్ బజందర్ మొత్తానికి ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ కాబోతున్నాడు. ప్రపంచంలోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అబుల్ కు ఎడాది వ్యవధిలో 16 సర్జరీలు జరిగాయి.
అతడి కాళ్ళు, చేతులపై పెరిగిన సుమారు ఐదు కిలోల బరువున్న బెరడులాంటి మొటిమలను ఈ సర్జరీల ద్వారా డాక్టర్లు తొలగించారు. తనకు శాపంలా మారిన వ్యాధి మొత్తానికి తొలగిపోయిందని, అది మళ్ళీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నానని అబుల్ తెలిపాడు.
ట్రీమ్యాన్ డిసీజ్ గా పిలిచే అతి అరుదైన ఎపిడెర్మో డిస్ ప్లేసియా వెరుసిఫోర్మిస్ అనే వ్యాధితో అతడు ఇన్నాళ్ళూ బాధపడ్డాడు. దీనివల్ల అతడి ఒంటిపై భారీగా మొటిమలు పెరిగి చివరికి కూతురిని ఎత్తుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోయింది అతడికి.
అబుల్ బజందర్ కు అందించిన చికిత్స వైద్య చరిత్రలోనే అరుదైన మైలురాయి అని ఢాకా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ కోఆర్డినేటర్ సమంతా లాల్ సేన్ చెప్పారు. ఈ ఆసుపత్రిలో అబుల్ కు ఉచితంగా చికిత్స చేస్తున్నారు.
"16 సార్లు సర్జరీ చేసి వాటిని తొలగించాం. ప్రస్తుతం అతని చేతులు, కాళ్ళు దాదాపుగా సాధారణ స్థితికి చేరాయి. మరో రెండు చిన్న సర్జరీలు చేసి మరో నెల రోజుల్లో అబుల్ బజందర్ ను డిశ్చార్జ్ చేయనున్నాం. మళ్ళీ ఆ బెరడులాంటి మొటిమలు కనుక రాకపోతే ఈ వ్యాధి నుండి విముక్తుడైన తొలి వ్యక్తి అతడే అవుతాడు..." అని డాక్టర్ సేన్ చెప్పారు.
"ఇలాంటి వ్యాధి పగవాళ్ళకు కూడా రాకూడదు. మళ్ళీ నేను నా కూతురిని ఎత్తుకోగాలుగుతానని ఎన్నడూ అనుకోలేదు, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా, త్వరలోనే ఇంటికి వెళ్తా.." అని అబుల్ బజందర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే వ్యాధితో బాధపడుతూ గత ఏడాది ఇండోనేషియాలో ఓ వ్యక్తి మృతి చెందాడు.