బెట్టు మాని మెట్టు దిగి.....
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కునే విషయంలో భారత జట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని తొలి టెస్టు ప్రారంభానికి ముందు అనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా తొలి టెస్టును భారత డ్రా చేయగలడమే కాకుండా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై ఆధిక్యత సాధించింది. దానికితోడు ఈ టెస్టులో ఆస్ట్రేలియా కన్నా భారత్ మెరుగైన ఆటను ప్రదర్శించిందని అనిపించుకుంది. భారత జట్టు అనూహ్యమైన మలుపుకు కారణమేమిటి?
ప్రముఖ సైకాలజిస్టు సాండీ గోర్డన్ ఉపదేశించిన మంత్రం గణనీయంగా పని చేయడం వల్లనే భారత ఆటగాళ్లు ముందడుగు వేశారని భావించాల్సి వస్తోంది. ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు అని సాండీ గోర్డన్ భారత క్రికెటర్లకు ఉపదేశించాడు. ఈ వారం మొదట్లో గోర్డాన్ భారత క్రికెటర్లకు క్లాసులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. అదే భారత క్రికెటర్లపై పని చేసింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు లేదనే భావనతో ప్రపంచ కప్లో ఆడిన భారత్ ఫైనల్కు చేరడానికి ముందు వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో అపజయాలను అడ్డుకోవడానికి, వీలైతే విజయ పథంలో పయనించడానికి భారత్ ఐదు అంశాలను ఎంపిక చేసుకుంది. ప్రతి టెస్టు మ్యాచ్కు ముందు మానసిక ధైర్యం, ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి ఒకటేసి చొప్పున నాలుగు అంశాలను ప్రధానం చేసుకుంటుంది. వన్డే సరీస్ కోసం ఒక అంశాన్ని ఎంపిక చేసుకుంటుంది. మిగతా మూడు టెస్టు మ్యాచ్ల కోసం, వన్డే సిరీస్కు థీమ్లను ఇంకా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వన్డే సిరీస్ జనవరి 9వ తేదీన ప్రారంభమవుతుంది.