తెలుగు గుండెచప్పుళ్ళు
నక్సలైట్లు చర్చలకు సిద్దపడటానికి కారణాలు ఏమై వుంటాయన్న అంశంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. బేషరతుగా చర్చలు అంటూనే ఎన్కౌంటర్లు ఆపివేయాలని, దాడులు నిలిపివేయాలని పీపుల్స్వార్ నాయకత్వం డిమాండ్లు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు తప్పుబడుతున్నాయి. తన పరంగా హింసను విడనాడే విషయం వార్ ప్రస్తావించకపోవడాన్ని కూడా అధికార వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వివాదంలో కూరుకుపోయే అవకాశం వున్నందున ఈ నెలాఖరులో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం వార్ ప్రతిపాదనలను, తన అభిప్రాయాలను నేతల ముందు వుంచుతుందని అంటున్నారు. నక్సల్స్ తమ లేఖకు సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నిర్ధేశించిన సమయంలో తాము కూడా ఎటువంటి హింసాకాండకు పాల్పడమని వార్ నక్సలైట్లు కూడా హామీ ఇవ్వాలని పౌరస్పందన వేదిక కోరింది. ఈ మేరకు పౌరస్పందన వేదిక కన్వీనర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శంకరన్ మరో లేఖ రాశారు. పౌరస్పందన వేదిక ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణా జిలాల్లకు అది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అయితే ఈ చర్చలు ఫలించడంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్తో చర్చలకు సిద్ధం కావడమంటే నక్సల్స్ పోరాట సమస్యలను ప్రభుత్వం రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధం కావడమేనని అది మాటల్లో చెప్పినంతా సులభమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.