వెంకన్నకు కర్పూరం లేని హారతి!
హైదరాబాద్: తెలుగుదేశం కింది స్థాయి నాయకులకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. నక్సలైట్ల పోరును ఎజెండాగా తీసుకొని ఎన్నికల రణరంగాన్ని సాగించడం కత్తి మీది సాములా తయారైంది. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్, కొంత మంది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మొర పెట్టుకున్న తీరు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. తీవ్రవాదం ఎజెండా వల్ల నక్సలైట్ల నుంచి తమకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని, నక్సల్స్ సమస్య శాంతియుతంగా పరిష్కరించాలని వారు చంద్రబాబును కోరారు. జైపాల్ యాదవ్పై ఇటీవల నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు ప్రభుత్వాధికారి తిరుపతి రెడ్డి గాయపడ్డారు.
రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎలాగున్నా తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇప్పటికే తెలుగుదేశం నాయకులపై నక్సలైట్లు దాడులు జరుపుతున్నారు; హతమారుస్తున్నారు కూడా. ఇదంతా తెలిసి కూడా చంద్రబాబు తీవ్రవాదం ఎజెండాను వీడదల్చుకోలేదు. తిరుమలలోని అలిపిరిలో తనపై నక్సల్స్ చేసిన దాడిని ఆయన కార్యకర్తలకు, నాయకులకు గుర్తు చేస్తున్నారు. అభివృద్ధికి తీవ్రవాదులు అడ్డు పడుతున్నారని ఆయన వాదిస్తున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ధోరణి ఏమీ మారలేదు. డయల్ యువర్ పార్టీ ప్రెసిడెంట్ కార్యక్రమంలో శనివారం ఆయన మరింతగా తీవ్రవాదులపై ధ్వజమెత్తారు. త్యాగాలకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
తీవ్రవాదాన్ని ఎజెండా చేసుకోవడంతో పాటు ఆయన ప్రతిపక్షాలను తీవ్రవాదులతో జమ కట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, తెలంగాన రాష్ట్ర సమితి రాజకీయ లబ్ధి కోసం తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. అయితే తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి చంద్రబాబు చెప్పినంత సజావుగానూ, సక్రమంగానూ లేదు. నక్సలైట్లపై ప్రజలందరూ సానుభూతి ప్రదర్శిస్తున్నారని గానీ, ప్రజలందరూ వారికి వ్యతిరేకంగా ఉన్నారని గానీ చెప్పడానికి వీల్లేదు. కొన్ని గ్రామాలు నక్సలైట్లపై తిరిగబడిన మాట వాస్తవమే. ఈ తిరుగుబాటుకు కూడా కొంత గుండె ధైర్యం కావాలి. ఈ గుండె ధైర్యాన్ని చంద్రబాబు ప్రజల్లోనూ, ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, స్థానిక నాయకుల్లోనూ ఆయన కోరుకుంటున్నారు. అందుకు వారిని సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు చెప్పినంత సులువైన పని కాదు.
నక్సలైట్లు చాలా వరకు ఆయుధాలతో నడిపిస్తున్నారనే విషయం పూర్తి అబద్ధమేమీ కాదు. కానీ స్థానిక నాయకుల పట్ల, ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రజలకు ఏదో మేరకు అసంతృప్తి, ఆగ్రహం ఉన్నదనే విషయాన్ని అంగీకరించకతప్పదు. అసలు నక్సలిజం అనేది పేదరికం నుంచి, ఆర్థిక సామాజిక అసమానతల నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం నుంచి, ప్రజల పట్ల ప్రదర్శించే ఉదాసీన వైఖరి నుంచి పుట్టుకొచ్చింది. నక్సలైట్ల అణచివేతకు రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం మీద, సిఆర్పిఎఫ్ బలగాల మీద, ప్రత్యేక పోలీసు విభాగం మీద ప్రజలకు ఏ మాత్రం గురి లేదు. పైగా వారంటే ఒక భయం కన్నా ఏవగింపు ఎక్కువగా ఉంది. వీరు ఏ మాత్రం ప్రజలను విశ్వాసంలోకి తీసుకోలేదు. నక్సలైట్ల పేరుతో పోలీసు యంత్రాంగం, భద్రతా బలగాలు చేసిన దురాగతాలు తెలంగాణలోని ప్రతి ఊరు కథలు కథలుగా చెప్తుంది. తీవ్రవాదం అణచివేతకు, రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా జరిపించడానికి ప్రభుత్వం అదే పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కల్వకుర్తి నాయకులు కలిసినప్పునడు చంద్రబాబు ఇదే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. ఇది సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తుంది. ప్రజల జీవితాలను మరింత ఛిన్నాభిన్నం చేస్తుంది.
ఇదంతా ఆలోచించినప్పునడు తీవ్రవాదుల కన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని గౌరవించే రాజకీయ పార్టీలు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించాల్సి వుంటుంది. తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నందుకు అనుభవించండనే పద్ధతిలో వ్యవహరిస్తే ప్రజలు కూడా సహనం కోల్పోయే ప్రమాదం ఏర్పడవచ్చు.