కన్సల్టెంట్లా, తెల్ల ఏనుగులా?
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య ఈ విషయాన్ని పట్టిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ బలం తగ్గకూడదని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ బలం తగ్గుతూ ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) బలం పెరగకూడదని ఆయన అనుకుంటున్నట్లు అర్థం అవుతోంది. కరీంనగర్ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం, ముకుందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ హనుమంత రెడ్డి ఇటీవల టిఆర్ఎస్లో చేరారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు- తెలంగాణలో కాంగ్రెస్ బలం తగ్గకూడదని అని అన్నారు. పైపైన చూస్తే ముఖ్యమంత్రికి కాంగ్రెస్పై అంత ప్రేమెందుకనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాబట్టి టిఆర్ఎస్ పెరగకూడదని ఆయన అనుకుంటున్నారని భావించే అవకాశం ఉంది. కానీ ఆయన మాటల్లో అంత కన్నా నిగూఢత దాగి ఉందనేది రాజకీయ పరిశీలకుల అంచనా.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీకి ఎక్కడికక్కడ ఓట్ల కోటా ఉందని చంద్రబాబు నమ్మకం. డ్వాక్రా మహిళల మద్దతు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి డోకా లేదని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించింది కూడా వీరేనని ఆయన విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే విషయాన్ని వెల్లడించింది. తమ ఓట్లు తమకు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలనేది చంద్రబాబు ఆలోచన అని చెబుతున్నారు.