తెలంగాణ ధూమ్ ధామ్
హైదరాబాద్లోని నాంపల్లిలో గల పబ్లిక్ గార్డెన్స్ వేదికపై తెలంగాణ ధూమ్ ధామ్ ఆదివారంనాడు వైభవోపేతంగా, ఉత్సాహపూరితంగా పెద్ద యెత్తున జరిగింది. దీనికి అనూహ్యమైన ప్రజాస్పందన లభించింది. అంతకు ముందు శాసనసభ ఎదురుగా గల గన్ పార్కులో గల తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుంచి ర్యాలీ ప్రారంభమై వేదిక వరకు సాగింది. తెలంగాణ విశిష్ట పర్వదినాలు, వేడుకలకు ప్రతీక అయిన బోనాలు, బతుకమ్మ, పీరీల వంటి వాటిని, పోతరాజు, ఒగ్గుకథ, సంక్రాంతి ముగ్గులు వంటి వాటిని ప్రతిబింబిస్తూ ఈ ర్యాలీ సాగింది. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతూ ప్రదర్శనలు జరిగాయి. గానాలాపన జరిగింది.
తెలంగాణ కళాకారుల ప్రదర్శనతో ఐదారు గంటల పాటు ప్రేక్షకులు చూస్తూ ఉండిపోయారు. గ్రామీణ ప్రజల వెతలకు అద్దం పడుతూ పాలమూరు కూలీల వలసలపై ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రసమయి బాలకిషన్, తదితర కళాకారులు ఈ ప్రదర్శనకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఢిల్లీ, హైదరాబాద్ పరిణామాలకు అద్దంపడుతూ రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ ప్రదర్శన ఇచ్చారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ దర్శకత్వం వహించారు. ఇటువంటి ప్రదర్శనలను తెలంగాణలోని గ్రామగ్రామాన ప్రదర్శిస్తామని తెలంగాణ ప్రజా గాయకులు ప్రకటించారు. గూడ అంజయ్య వంటి ప్రముఖ కళాకారులు ఈ ధూమ్ ధామ్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పాటు బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి తదితరులు వచ్చారు. తెలంగాణ మేధావులు, యువతీయువకులు, విద్యార్థులు పెద్ద యెత్తున ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.