ఈసేవమధురం
ఈ స్థితిలో నక్సలైట్లు నల్లగొండ జిల్లా దేవరకొండ గిరిజన శాసనసభ్యుడు ధీరావత్ రాగ్యా నాయక్ను హత్య చేశారు. (రాగ్యానాయక్ను హత్య చేసినందుకు క్షమాపణ చెప్పుకున్నారు. అంత మాత్రాన కాలం వెనక్కి తిరిగి రాదు కదా!) దీంతో ప్రతిపక్షాల నోళ్లకు నక్సలైట్ల విషయంలో తాళం పడింది.
నిజానికి, రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, సామాన్య ప్రజల నిత్య జీవిత సమస్యలు రాజకీయ ఎజెండా మీదికి రావాలని పౌర స్పందన వేదిక నాలుగేళ్లుగా కృషి చేస్తోంది. ప్రభుత్వం, పీపుల్స్వార్ హింస, ప్రతి హింసలను ఆపేయాలని ప్రతిపాదనలను పెడుతూ వస్తోంది. తాజాగా బుధవారంనాడు పౌర స్పందన వేదిక ప్రభుత్వానికి, పీపుల్స్వార్కు ఆరేసి ప్రతిపాదనలు చేసింది. వాస్తవానికి, ఈ ఆరు ప్రతిపాదనలు కూడా నిర్హేతుకమైనవి, ఆచరణ సాధ్యం కానివి ఏమీ కావు. ఇటు ప్రభుత్వం గానీ, అటు పీపుల్స్వార్ గానీ తప్పకుండా ఆచరించాల్సినవి. రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలనే పౌర స్పందన వేదిక ఆచరణకు ప్రభుత్వం ముందు ఉంచింది.