సరస్వతికి చదువొచ్చా?!
తిరుమలః కలియుగ వైకుంఠ నాధుడు శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం అంత సులభ సాధ్యం కాదు. గంటల తరబడి క్యూల్లో నిలబడాలి. సుదర్శనం టోకెన్ తీసుకున్నా క్యూల్లో జాగారం తప్పని పరిస్థితి. నిత్యం ఆ శ్రీనివాసుడ్ని సందర్శించుకొనేందుకు భక్తులు వేల సంఖ్యలో రావడమే అందుకు కారణం. సుదర్శనం పేరిట కంకణం కట్టి దర్శనం అయ్యే సమయం కేటాయిస్తున్న నాటి నుంచి పరిస్థితి కాస్త మెరుగుపడింది. పరిస్థితిని పూర్తి స్థాయిలో మెరుగుపరచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కలియుగ వైకుంఠ నాధుడి దర్శనాన్ని ఇ-సేవ పధకానికి లింక్ చేయనున్నారు.
ఆన్ లైన్ ద్వారా సుదర్శన చక్ర సేవల్ని అందించేందుకు ఇ-సేవా ప్రాజెక్టు అధికారులు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించు కోవాలనుకున్నాడు. గుంటూరులో ఇ-సేవ ద్వారా సుదర్శన చక్రం పథకంలో పేరు నమోదు చేసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం దర్శనానికి సమయం వచ్చిందనుకుందాం. అప్పటికప్పుడైనా బస్సులో బయలుదేరి దర్శనం సమయానికి తిరుపతి చేరుకొనే అవకాశం ఈ సౌకర్యం ద్వారా లభిస్తుంది. ప్రయాణానికి ముందుగా రిజర్వు చేయించుకున్న వారు సైతం నిదానంగా తిరుమల చేరుకొని ప్రయాస లేకుండా స్వామి వారిని సందర్శించుకొనే అవకాశం వుంది.
స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలనుకూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకొనే సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఇ-సేవ డైరెక్టర్ ఫణికుమార్ చెప్పారు. ఈ పథకాన్ని ఆరు నెలల్లో ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. త్వరలో ఇ-సేవా సెంటర్లలో సినిమా టిక్కెట్లు,రైల్వే టిక్కెట్లు కూడా విక్రయించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గత ఆగస్టులో ప్రారంభించిన ఇ-సేవ పధకం ద్వారా 4.6 లక్షల మంది ఆన్ లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. ఐదు నెలల్లోనే ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ద్వారా 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. అన్నిటికంటే ఇ-సేవ ద్వారా వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా వుంటున్నదనేది నిర్వివాదాంశం. పది చోట్ల పది బిల్లులు కట్టేందుకు బదులు ఒకేచోట తక్కువ సమయంలో అన్ని బిల్లులు చెల్లించే వీలు కలుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితం అయిన ఇ-సేవ త్వరలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.