పేరు నింపండి, ఉచిత బహుమతి అందుకోండి
న్యూఢిల్లీః జనవరి తొమ్మిది నుంచి ప్రవాసి భారతీయ దివస్ ను నిర్వహించనున్నట్టు భారత విదేశాంగ శాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కి) ప్రకటించాయి. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును ప్రధాని వాజ్ పేయి ప్రారంభిస్తారు. ఈ సదస్సులోనే ప్రవాసీ భారతీయ సమ్మాన్ -2004 అవార్డులను బహూకరిస్తారు. ప్రవాసి భారతీయ దివస్ మన దేశంలో జరగబోవడం ఇది రెండోసారి. గత ఏడాది సదస్సు తీర్మానాలు ఎంతవరకు అమలయ్యాయో ఈ సమావేశంలో సమీక్షిస్తారు. ద్వంద్వ పౌరసత్వ చట్టానికి సవరణలు తెస్తామని ప్రధాని వాజ్ పేయి గత ఏడాది జనవరిలో ప్రకటించారు. ఈ సవరణలకు సంబంధించిన లాంఛనాలు 2004 జనవరి తొమ్మిది లోపు పూర్తి చేసే అవకాశం ఉంది. గల్ఫ్ ఇన్సూరెన్స్ స్కీం, ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ సవరణలను ఈ సదస్సులో ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలలా నివసిస్తున్న ప్రవాస భారతీయులను ఒక తాటి మీదికి తీసుకు రావడమే ప్రవాసి భారతీయ దివస్ లక్ష్యం. ప్రవాస భారతీయులను సంఘటిత పరచడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి జనవరి సదస్సు దోహదపడుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి జెసి శర్మ చెప్పారు. గల్ఫ్ లోని భారతీయుల సమస్యలకు పరిష్కార మార్గాలను జనవరి సదస్సులో కనుగొంటారు. ప్రవాస భారతీయుల్లో యువకులను ప్రత్యేకంగా ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇరవై దేశాల నుంచి ఇరవై మంది భారతీయ విద్యార్ధులకు ఇండియాలో రెండు మూడు వారా ల పాటు ఇంటర్న్ షిప్ నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి సదస్సులో ఉపప్రధాని అద్వానీ, ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ తదితరులు ప్రసంగిస్తారు. 1915 జనవరి 9న మహాత్మాగాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఏడాదిఆ రోజున ప్రవాస భారతీయుల దినంగా జరుపుకుంటున్నాం.