పోలీసు బాస్కు గాలం
హైదరాబాద్: సినీనటుల మేళా తయారైంది. ఎన్నికల పండుగ సమీపించడంతో సినీ నటులకు గిరాకీ పెరిగింది. సినీ నటులు పోటీ పడి రాజకీయ పార్టీల్లో చేరుతున్నారు. అధికారంలో పార్టీ వైపు వారు మొగ్గు చూపడం అతి సహజం. సినీ పరిశ్రమ అనేది వ్యాపారమే తప్ప అంతకు మించిన విలువలు ఆపాదించనవసరం లేదు. ఆర్ట్ సినిమా రోజు రోజుకూ కుంచించుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వ్యాపార సినిమా విస్తృతి పెరిగింది. వ్యాపార సినిమాకు కళావిలువలు, సైద్ధాంతిక నిబద్దత, మానవీయ లక్షణాలు ఉండడం చాలా అరుదు. సినిమాను ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించడం చాలా అరుదుగా జరిగే విషయంగా మారింది. ఈ స్థితిలో సినీ నటులు నిబద్ధతతో ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల్లో చేరుతున్నారనేది నేతి బీరకాయ వంటిది.
ఎన్నికలు సమీపించడంతో తమ ప్రచారం కోసం రాజకీయ పార్టీలు సినీ నటులకు తలుపులు బార్లా తెరుస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో సినీ కళాకారులు ప్రధాన పాత్ర పోషించిన సందర్భాలు లేకపోలేదు. అయితే తమ తమ పరిమితులకు లోబడి పని చేసేవారున్నారు. అయితే కేవలం ప్రాపకం కోసమే వారు అధికార పార్టీల్లో చేరడం రివాజుగా మారింది.
రాజకీయాల్లో చేరిన తర్వాత సినీ కళాకారులు ప్రజల కోసం పెద్దగా పొడిచేసిన సందర్భాలు కూడా లేవు. అయితే ఎంజిఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి తాజా పాత తరం పరిస్థితి వేరు. ఎన్టీఆర్ రాజకీయ, సామాజిక రంగంలో నిర్వర్తించిన పాత్ర విస్మరించరానిది. ఆయన గ్లామర్ రాజకీయాలకు ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు తమ బాధలను తీర్చే నాయకుడిగా తర్వాత్తర్వాత కనిపించడం ప్రారంభించారు. గ్లామర్ ఉండి ప్రజల విశేష ఆదరణ పొందిన ఎన్టీఆర్ను కూడా తిరస్కరించిన చరిత్ర ప్రజలకు ఉంది. మళ్లీ అదే ఎన్టీఆర్కు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ వంటి నటులు రాజకీయాల్లో ప్రవేశించడం వేరు. చోటామోటా సినీ నటులు రాజకీయ పార్టీల్లో చేరడం వేరు.
ఇటీవలి తెలుగుదేశం విజయభేరి సభకు సినీ కొంత మేరకు ఉపయోగపడింది. ప్రజలను అలరించడంలో వారు తమ వంతు పాత్ర నిర్వహించారు. అయితే అంతకు మించిన ప్రయోజనం వారి వల్ల లేదు. సినీ నటి రోజా శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సుమన్, శరత్బాబు వంటి నటులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమకు విడదీయలేని సంబంధం ఏర్పడింది. సామాజిక శ్రేణుల ఐక్యత దృష్ట్యా ఇది ఒనగూడి ఉంటుంది. కాంగ్రెస్లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగిన సత్తా ఆయనకు ఉంది. ఇతరులు అలా మనుగడ సాగించడం దుర్లభం. దాసరి నారాయణరావుకు సమాజం పట్ల ఒక అవగాహన ఉంది. సమాజంపై, రాజకీయాలపై ఆయన దృష్టి ఎప్పుడూ వుంటుంది. అందుకే ఆయన నుంచి కొన్ని ప్రయోజనకరమైన సినిమాలు వచ్చాయి.
ఎన్టీఆర్ లాంటి ఉద్ధండులు, దాసరి వంటి సామాజిక స్పృహ కలిగిన సనీ ప్రముఖులు తక్కువ. అందువల్లనే సినీ ప్రముఖులు పలువురు రాజ్యసభకు నామినేట్ అయిన ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కొంత మంది పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడానికి బద్దకించారు. ఇక వారి రాజకీయ ప్రవేశం ఎందుకు? ఎవరి కోసం? ఏదో కొంత చేయాలనే కోరిక ఉన్న సినీ ప్రముఖులు మాత్రమే రాజకీయాలకు వస్తే మంచిది. లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉండి రంగులు పూసుకుంటూ వెండితెరపై వెలిగిపోతే ఎవరికీ నష్టం లేదు.