దియా మిర్జా ఫోటో గ్యాలరీ
రెంటాల అవార్డు ఈ ఏడాది ప్రొఫెసర్ అల్లాడి ఉమ, శ్రీధర్లకు దక్కింది. తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించడంలో విశేష కృషి చేసినందుకుగాను వారిద్దరికీ ఈ అవార్డు లభించింది. వీరు తెలుగు కవిత్వాన్ని, కథలను ఆంగ్లంలోకి అనువదించారు. 1990లో పెద్ద యెత్తున ముందుకు వచ్చిన స్త్రీ, దళిత, ముస్లిం వాద సాహిత్యాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయడంలో విరు చూపిన శ్రద్ధ విశేషమైంది. తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయడమనే ఆలోచన వచ్చిన వెంటనే తట్టే పేర్లు వీరిద్దరివే కావడం అందరికీ తెలిసిందే.
తొలి దశలో అభ్యుదయ కవిత్వానికి పేరు పొందిన రెంటాల గోపాలకృష్ణ (1920 - 1995) తర్వాత తన జీవితాన్ని సంస్కృతం, ఇంగ్లీష్ భాషల నుంచి వివిధ అంశాలను తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందించడానికే వెచ్చించారు. ఆయన ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు చేసినప్పటికీ తెలుగు అనువాదాలు ఇతర భాషల్లో వెలువడాలని నిరంతరం తపించేవారు. ఆయన ఆకాంక్షను, తపనను దృష్టిలో వుంచుకుని ఆయన పేరు అవార్డును నెలకొల్పారు.
రెంటాల అవార్డును వచ్చే నెల 6వ తేదీన ఉమశ్రీధరల్కు హైదరాబాద్లో అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి అధ్యక్షత వహిస్తారు. విస్కాన్సన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వేల్చేరు నారాయణ రావు ఉమశ్రీధర్లకు అవార్డును ప్రదానం చేస్తారు. డాక్టర్ సునీతా రాణి వారి అనువాదాల గురించి మాట్లాడ్తారు. ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్ రెంటాల అనువాదాల గురించి ప్రసంగిస్తారు.