మొద్దు శీను భార్యతో మాటామంతీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను గురువారం తన భార్యతో మాటామంతీ జరిపారు. భార్యాపిల్లలతో మాట్లాడడానికి కోర్టు మొద్దు శీనుకు అనుమతి ఇచ్చింది. దీంతో అతను భార్యతో కాసేపు మాట్లాడాడు. ఒక హత్య కేసులో మొద్దు శీనును గురువారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కోర్టులో హాజరు పరిచారు. భూవివాదాల సెటిల్మెంటులో మొద్దు శీను చర్లపల్లి జైలు నుంచే కథ నడుపుతున్నాడని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో డిప్యూటీ జైలర్ శ్రీనివాస నాయక్ను ప్రభత్వం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారాన్ని ఒక తెలుగు ప్రైవేట్ టీవీ చానల్ బయటపెట్టింది.
తాజాగా గురువారంనాడు మరో ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ మొద్దు శీను భార్య ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. సెటిల్మెంట్ వ్యవహారాలతో తన భర్తకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె చెప్పింది. తాను మియాపూర్, హయత్నగర్ల చుట్టూ తన భర్తతో మాట్లాడడానికి తిరుగుతున్నానని ఆమె చెప్పింది. ఎట్టకేలకు కోర్టు అనుమతితో ఈ రోజు మాట్లాడగలిగానని ఆమె అన్నది. సెటిల్మెంట్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని తన భర్త తనతో చెప్పాడని ఆమె స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ప్రకటనలను ఆమె వ్యతిరేకించింది. చంద్రబాబు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, చంద్రబాబు ఉద్దేశం ఏమిటో తెలియడం లేదని ఆమె అన్నది. తమకు ఏ కాంగ్రెస్ నాయకుల అండదండలూ లేవని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు తాను నడుచుకుంటూ వచ్చానని, కాంగ్రెస్ నాయకుల అండదండలుంటే ఇలా నడుచుకుంటూ వచ్చేదాన్నా అని ఆమె అడిగింది.